భూత్పూర్- చించోళి హైవేకు మహర్దశ
ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST
భూత్పూర్- చించోళి హైవేకు మహర్దశ
ఎన్హెచ్-167 కింద రహదారి అభివృద్ధి- రూ.703కోట్లు మంజూరు చేసిన కేంద్రం
- డీపీఆర్ సిద్ధం... త్వరలోనే భూసేకరణ
తాండూరు, జనవరి 21: మహబూబ్ నగర్ జిల్లా శివారు భూత్పూర్ నుంచి తాండూరు మీదుగా కర్ణాటకలోని చించోళి వరకు ఉన్న 96కిలో మీటర్ల రోడ్డును కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే 167గా గుర్తించి జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు రూ.703కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని ఏడాది కిందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్-167కు నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారి విస్తరణపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్ర ఉపరితల రవాణా శాఖకు పంపింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి నిధులు మంజూరు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎన్హెచ్-167 సాకారంలో ఎస్హెచ్ఏ కార్యదర్శి గిరిధర్, రాష్ట్ర ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాస్ కృషి ఉంది. మహబూబ్నగర్ నుంచి చించోళి వరకు విస్తరించే జాతీయ రహదారి కొడంగల్ - తాండూరు మీదుగా వెళ్తుంది. ఈ రెండు చోట్టా బైపాస్ వస్తుంది. తాండూరులో ప్రస్తుత రోడ్డును వన్టైం బెటర్మెంట్(ఓటీబీ) కింద ఎన్హెచ్ఏఐ అభివృద్ధి చేస్తుంది. తాండూరు శివారు రసూల్పూర్ నుంచి జాతీయ రహదారి బైపాస్ ప్రారంభమవుతుంది. పాత తాండూరు, చెనిగే్షపూర్, గౌతాపూర్ గ్రామం వెనుక నుంచి చించోళి రోడ్డుకు కలుస్తుంది. ఈ రోడ్డు విస్తరణకు త్వరలోనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నేషనల్ హైవే పూర్తయితే కొడంగల్-తాండూరు ప్రాంతాల ముఖచిత్రం మారి ఈ ప్రాంత ప్రజల రోడ్డు సమస్య పరిష్కారమవుతుంది. 96 కిలోమీటర్ల జాతీయ రహదారిని నాలుగు లేన్లు ఏర్పాటు చేయనున్నారు. . బెంగళూరు, ముంబయి, రాంచీ జాతీయ రహదారులకు అనుసంధానానికి ప్రతిపాదించారు. తాండూరునియోజకవర్గంలో కొత్లాపూర్ నుంచి యాలాల మండలం బండమీదిపల్లి వరకు 26 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ జరుగనుంది.