ప్రజారోగ్యాన్ని కేసీఆర్ గాలికొదిలేశారు : భట్టీ
ABN , First Publish Date - 2020-08-12T03:17:41+05:30 IST
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నిధులు ఖర్చు పెట్టి నియంత్రించాల్సిన సీఎం కేసీఆర్..
హైదరాబాద్ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నిధులు ఖర్చు పెట్టి నియంత్రించాల్సిన సీఎం కేసీఆర్.. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన భట్టీ.. కరోనా ప్రజల్ని ఇబ్బంది పెడుతోందని.. జనం చనిపోతుంటే కూడా సీఎం కరోనాపై రివ్యూ పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు.
వెయ్యి అని చెప్పి వందేనా!?
‘నా స్నేహితుడి కొడుకు కరోనాతో ఓ హాస్పిటల్లో చేరి 21 రోజుల తర్వాత మరణించారు. 21 రోజులకు 21లక్షలు బిల్లు చెల్లించినా శవమై వచ్చాడు. ప్రభుత్వం చేయదు ప్రైవేట్ దోచుకుంటుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది..?. 1000 కోట్లయినా ఖర్చుపెడతామని చెప్పి 100 కోట్లు కేటాయించడానికి బుద్ధి ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లోని 50 శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. హోటల్స్లోని 50 శాతం రూమ్లను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వాటిని క్వారంటైన్ కోసం కేటాయించాలి. ప్రభుత్వమే ధర నిర్ణయించి చెల్లించాలి. పర్యవేక్షణ కోసం ఒక్కో పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక ఐఏఎస్ను నియమించండి. ప్రభుత్వం పాపపు పనులకు వొడిగట్టొద్దు. డాక్టర్లను, వైద్య సిబ్బందిని వెంటనే నియమించండి’ అని ప్రభుత్వాన్ని భట్టీ డిమాండ్ చేశారు.