మేం తప్పకుండా వెళ్తాం.. ఎలా ఆపుతారో చూస్తాం : భట్టీ

ABN , First Publish Date - 2020-10-17T20:19:08+05:30 IST

తెలంగాణ రాష్ట్రం వర్షాలకు వెనిస్ నగరంలా కనిపించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

మేం తప్పకుండా వెళ్తాం.. ఎలా ఆపుతారో చూస్తాం : భట్టీ

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రం వర్షాలకు వెనిస్ నగరంలా కనిపించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామన్నారని.. మంత్రి కేటీఆర్ విశ్వనగరం అన్నారని వాళ్లు చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు. అసలు 72 వేల కోట్ల రూపాయిల అభివృద్ధి ఎటు పోయిందని మీడియా ముఖంగా భట్టీ అడిగారు. టీఆర్ఎస్‌ను దూరం పెట్టి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కల్వకుర్తి ప్రాజెక్టు పంపు హౌజ్ మునకకు గత ప్రభుత్వం కారణం అనడానికి సిగ్గుండాలన్నారు. 


ఎలా ఆపుతారో చూస్తాం!

పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ నిర్మించొద్దని నిపుణుల కమిటీ చెప్పిందన్న విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు. అండర్ గ్రౌండ్ బ్లాస్ట్‌లతో కల్వకుర్తికి నష్టం జరుగుతుందని చెప్పారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ది కోసం అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ నిర్మాణం చేపట్టారని.. తన అనుకూలమైన ఈఎన్సీకి మినహాయింపు ఇచ్చి ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని భట్టీ మండిపడ్డారు. ఈఎన్సీ మురళీధర్ రావు ఇచ్చిన అన్ని పనులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల వద్దకు ప్రతిపక్షాలను ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించారు. త్వరలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కల్వకుర్తి ప్రాజెక్ట్‌కు మేం తప్పకుండా వెళ్లి పర్యటిస్తామని.. ఎవరు ఎలా ఆపుతారో చూస్తామంటూ భట్టీ ఒకింత సవాలే విసిరారు. ఈ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వవకుంటే కోర్టు అనుమతి తీసుకొని మరీ కల్వకుర్తి వెళ్లి ప్రాజెక్టును పరిశీలిస్తామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా సంఘట స్థలాన్ని సందర్శిండం తన భాద్యత అని పోలీసులే తమకు భద్రత కల్పించాలని భట్టీ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-10-17T20:19:08+05:30 IST