ఆయన పార్టీ మారరు: భట్టి
ABN , First Publish Date - 2020-12-05T22:28:37+05:30 IST
జానారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ప్రచారాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొట్టిపారేశారు
హైదరాబాద్: జానారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ప్రచారాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొట్టిపారేశారు. జానారెడ్డి పార్టీ మారతారని కొందరు సోషల్మీడియాలో ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. సోషల్మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక పీసీసీ చీఫ్ను అధిష్ఠానం నిర్ణయిస్తుందని భట్టి తేల్చిచెప్పారు.
ఫలితాలు నిరాశపరిచాయి...
జీహెచ్ఎంసీ ఫలితాలు కాంగ్రెస్ను నిరాశపర్చాయని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల అవసరాల చుట్టూ ఎన్నికలు జరగలేదని తెలిపారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాయని ఆరోపించారు. మేం భావోద్వేగాలు రెచ్చగొట్టే స్థాయికి దిగజారబోమని స్పష్టం చేశారు. ఈ ఫలితాలు శాశ్వతం కాదు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎంఐఎంతో పొత్తుపెట్టుకోలేదని భట్టి విక్రమార్క వెల్లడించారు.