Covid-19 Vaccine: కోవిడ్పై పోరాటంలో భారత్ మరింత శక్తిమంతం
ABN , First Publish Date - 2022-09-06T22:01:56+05:30 IST
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భారత దేశానికి మరో శుభవార్త
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భారత దేశానికి మరో శుభవార్త అందింది. భారత్ బయోటెక్ తయారు చేసిన నాజల్ వ్యాక్సిన్ను ప్రజల కోసం ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో 18 సంవత్సరాలకు పైబడిన వయసుగలవారికి ఈ టీకాను ఇచ్చేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతి మంజూరు చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం ఇచ్చిన ట్వీట్లో, కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశ పోరాటానికి గొప్ప బలం వచ్చిందని తెలిపారు. భారత్ బయోటెక్ తయారు చేసిన చింపాంజీ అడెనోవైరస్ వెక్టార్డ్ రీకాంబినెంట్ నాజల్ వ్యాక్సిన్కు సీడీఎస్సీఓ ఆమోదం తెలిపిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 18 సంవత్సరాల వయసు పైబడినవారికి పరిమితంగా వినియోగించేందుకు అనుమతి లభించినట్లు తెలిపారు.
కోవిడ్ మహమ్మారిపై మన ఉమ్మడి పోరాటాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కోవిడ్ -19పై పోరాటంలో భారత దేశం తన సైన్స్, పరిశోధన, అభివృద్ధి మానవ వనరులను వినియోగించిందని చెప్పారు. సైన్స్ చోదక వైఖరితో, అందరి కృషితో ఈ మహమ్మారిని ఓడిస్తామని తెలిపారు.