భక్తాంజనేయ ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-11-30T05:43:20+05:30 IST

భక్తాంజనేయ ఆలయంలో చోరీ

భక్తాంజనేయ ఆలయంలో చోరీ

రూ.9.50లక్షల విలువైన ఆభరణాలు మాయం

గన్నవరం, నవంబరు 29 : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.9.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను  అపహరించుకుపోయారు. దేవదాయ శాఖ పరిధిలోని ఈ ఆలయాన్ని ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రధాన అర్చకుడు రాధాకృష్ణమూర్తి మూసివేశారు. తెల్లవారుజామున వచ్చి చూడగా, ఐరన్‌ గ్రిల్‌, గర్భగుడి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా స్వామి విగ్రహంపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఈవో శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చోరీ జరిగినట్లు గుర్తించి గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలోని సీసీ కెమెరాల కనెక్షన్‌ తొలగించి దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గర్భగుడిలోని మరో సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా రాత్రి 11 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. దొంగలు ముఖం కనిపించకుండా మంకీ క్యాప్‌ ధరించారని పోలీసులు తెలిపారు. మూడు గ్రాముల బంగారం, 13 కిలోల వెండిని అపహరించుకుపోయారు. ఈవో ఫిర్యాదు మేరకు ఈస్ట్‌ జోన్‌ ఏసీపీ విజయ్‌పాల్‌, సీఐ కె.శివాజీ, క్రైమ్‌ ఎస్సై ఫ్రాన్సిస్‌ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-11-30T05:43:20+05:30 IST