భక్తజన సంద్రం

ABN , First Publish Date - 2022-06-27T06:57:48+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తుల రద్దీ ఆదివారం అనూహ్యంగా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా భక్తులు పోటెత్తారు.

భక్తజన సంద్రం
రాహుకేతు పూజామండపం వద్ద భక్తులు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనూహ్యంగా పెరిగిన రద్దీ


శ్రీకాళహస్తి, జూన్‌ 26: శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తుల రద్దీ ఆదివారం అనూహ్యంగా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. రాహుకాల సమయంలో అత్యధికంగా ఆలయంలో రద్దీ కనిపించింది. ఆలయ పాలకమండలి చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు రాహుకాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కంచుగడప వద్ద క్యూలైన్లను పర్యవేక్షించారు. భక్తుల సంఖ్య అధికం కావడంతో ఆలయ పరిసరాల్లో కారు పార్కింగ్‌ సమస్య ఏర్పడింది. సన్నిధి వీధి మొత్తం ఒక్కసారిగా వాహనాలు నిండిపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. 

రికార్డుస్థాయిలో ప్రత్యేక దర్శన టిక్కెట్ల అమ్మకాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం ప్రత్యేక దర్శన టిక్కెట్లు రికార్డు స్థాయిలో 7,750 (రూ.50 దర్శన టిక్కెట్లు-3,898, రూ.200 ప్రత్యేక శీఘ్ర దర్శన టిక్కెట్లు-3,852) అమ్ముడయ్యాయి.  రాహుకేతు పూజా టిక్కెట్లు కూడా అత్యధికంగా ఐదువేలను దాటడం గమనార్హం. రూ.500 రాహుకేతు పూజా టిక్కెట్లు 3,096, రూ.750- 1,192, రూ.1,500-376, రూ.2,500-303, రూ.5వేల టిక్కెట్లు 56మంది భక్తులు కొనుగోలు చేశారు.  మొత్తంగా 5,023 రాహుకేతు టిక్కెట్లను విక్రయించారు. ప్రసాదాల్లోనూ రికార్డుస్థాయి అమ్మకాలు జరిగాయి. చిన్న లడ్డు, వడ, పులిహోర, పెద్దలడ్డు, జిలేబీ ప్రసాదాలు అన్నీ కలిపి 23,603 ప్యాకెట్ల విక్రయాలు జరిగాయి. 

Updated Date - 2022-06-27T06:57:48+05:30 IST