లాకెట్‌ కావాలా భక్తా!

ABN , First Publish Date - 2022-08-20T09:35:49+05:30 IST

భక్తులు తమ ఇష్టదైవానికి చెందిన బొమ్మతో కూడిన బంగారు, వెండి, రాగి లాకెట్‌లను పొందేలా దేవాదాయ శాఖ తాజాగా ఏర్పాట్లు చేసింది.

లాకెట్‌ కావాలా భక్తా!

యాదాద్రీశుడి ఆలయంలో బంగారు లాకెట్‌

ఇతర ఆలయాల్లో వెండి, రాగి లాకెట్‌ల విక్రయం

దేవాదాయ శాఖ వెల్లడి


హైదరాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): భక్తులు తమ ఇష్టదైవానికి చెందిన బొమ్మతో కూడిన బంగారు, వెండి, రాగి లాకెట్‌లను పొందేలా దేవాదాయ శాఖ తాజాగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల వద్ద వీటిని భక్తులకు అందుబాటులో ఉంచింది. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బంగారం లాకెట్‌లను, కొండగట్టు, బాసర, భద్రాచలం, ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, వరంగల్‌ భద్రకాళి, కొరవి వీరభద్రస్వామి ఆలయాలు సహా రాష్ట్రంలోని 15 దేవాలయాల్లో వెండి, రాగి లాకెట్‌లను అధికారులు విక్రయిస్తున్నారు. భక్తులు సమర్పించే బంగారు, వెండి కానుకలను కరిగించడం ద్వారా ఈ లాకెట్‌లను రూపొందిస్తున్నారు. రాగి లాకెట్‌లకు మాత్రం రాగిని బయటినుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆయా ఆలయాల మూల విరాట్టు వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన లాకెట్‌లను భక్తులకు అందుబాటు ధరల్లో ఆలయ కౌంటర్లలో విక్రయిస్తున్నారు. ‘‘మొదటి దశలో 15 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా లాకెట్‌లు విక్రయిస్తున్నాం. యాదగిరి గుట్టలో మాత్రమే బంగారం లాకెట్‌లు ఉన్నాయి. భక్తుల డిమాండ్‌ల మేరకు ఇతర ఆలయాల్లోనూ బంగారు లాకెట్‌లు తయారుచేస్తాం’’ అని దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. 

Updated Date - 2022-08-20T09:35:49+05:30 IST