పారిపోయే పరివార్ కానున్న బీజేపీ పరివార్: అఖిలేష్

ABN , First Publish Date - 2021-10-31T01:32:14+05:30 IST

యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీపై ప్రజలు అసహనంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో బీజేపీ కుటుంబం..

పారిపోయే పరివార్ కానున్న బీజేపీ పరివార్: అఖిలేష్

లక్నో: యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీపై ప్రజలు అసహనంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో బీజేపీ కుటుంబం (బీజేపీ పరివార్) పారిపోయే కుటుబం (భాగ్‌తా పరివార్) కానుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు శాసనసభ్యులు శనివారంనాడు అఖిలేష్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. వీరిలో ఒకరు బీజేపీ శాసనసభ్యుడు కాగా, ఏడుగురు బీఎస్‌పీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కావడం విశేషం. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రాథోర్‌ సమాజ్‌వాదీ పార్టీలోకి వచ్చిన తరహాలోనే ఆ పార్టీకి చెందిన పలువురు తనతో సంప్రదింపులు సాగిస్తున్నారని చెప్పారు. అఖిలేష్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా పట్టుదలతో ఉన్నామని ఆ పార్టీలో చేరిన రాకేష్ రాథోర్, బీఎస్‌పీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్లాం రైని, సుస్మితా పటేల్, అస్లాం అలీ, హకిం లాల్ బింద్, ముజ్తాబా సిద్ధిఖి, హర్‌గోవింద్ భార్గవ అన్నారు.


బీజేపీ తమకు 403 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ప్రకటించుకోవడం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటపోతామనే భయంతో ఉన్నట్టు అవగహతమవుతోందని అఖిలేష్ ఈ సందర్భంగా అన్నారు. బీజేపీ టిక్కెట్లను ఆశించే వాళ్లు కూడా తగినంత మంది లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను అఖిలేష్ తిప్పికొట్టారు. బీజేపీ నేతలు అసలు మేనిఫెస్టో పేజీలు కూడా తిరగేయడం మరిచిపోయినట్టున్నారని అన్నారు. రైతుల కోసం రోడ్‌మ్యాప్ తయారు చేసి 2022 నాటికి వారి ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీసారు.  వివిధ వేదికల నుంచి కూడా ఇదే మాట పదేపదే ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారని అన్నారు. మిగతా హామీలకూ వారు ఇదే గతి పట్టించారని ఆక్షేపించారు. ఎస్‌పీ మాజీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్‌ను సైతం దూరంగా ఉంచుతామనే సంకేతాలు ఇస్తూ, బీజేపీ-కాంగ్రెస్ ఒకటేనని అఖిలేష్ వ్యాఖ్యానించారు.


ఒక నిర్దిష్ట సిద్ధాంతాలకు చెందిన వారికే పోస్టింగ్‌లు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించిందని, అభివృద్ధి పనులు చేపట్టడానికి బదులు బడ్జెట్‌ను  ప్రచారానికే వాడుకుంటున్నారని విమర్శించారు. యూపీలో ఏర్పాటు చేసిన పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్‌మెంట్ మీట్) వల్ల ఒరిగిందేమిటని నిలదీశారు. ఆ ఈవెంట్ తర్వాత ఎందరికి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. ఉద్యోగాలు కోరుతూ వచ్చిన వారిని లాఠీలతో తరిమికొట్టి అవమానించారని, అదే యువత ఇప్పుడు తమ ఓట్లతో బీజేపీని తరిమికొట్టాలని అఖిలేష్ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-10-31T01:32:14+05:30 IST