చెదపురుగులు తెల్లటి చెక్కను ఇష్టంగా తింటాయని ఆమె పరిశోధల ద్వారా గ్రహించింది.. వెంటనే వాటిని అక్కడ పాతింది.. తరువాత..

ABN , First Publish Date - 2021-11-29T13:47:49+05:30 IST

రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఖాటూశ్యామ్‌జీ..

చెదపురుగులు తెల్లటి చెక్కను ఇష్టంగా తింటాయని ఆమె పరిశోధల ద్వారా గ్రహించింది.. వెంటనే వాటిని అక్కడ పాతింది.. తరువాత..

రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఖాటూశ్యామ్‌జీ మందిరం ప్రముఖమైనదిగా పేరొందింది. ఇక్కడికి సమీపంలోనే గోవటి గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన భగవతి దేవి తన నూతన ఆవిష్కరణలతో దేశ విదేశాల్లో సన్మానాలు, సత్కారాలు అందుకుంటోంది. ఇటీవల మీడియాతో ఆమె ముచ్చటించింది.. అవి ఆమె మాటల్లోనే.. ‘నేను 1952, అక్టోబరు 16న జన్మించాను. కొండ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ల కోసం కలపను సేకరించే పనిలో నాన్న ఉండేవారు. అమ్మతో పాటు మేము.. ఐదుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెళ్లం వ్యవసాయ పనులు చేసేవాళ్లం. 1971లో నాకు సుండరామ్ వర్మతో వివాహం జరిగింది. వ్యవసాయం అంటే మా ఆయనకు ఎంతో ప్రాణం. అందుకే ఆయన వ్యవసాయానికి సంబంధించిన బీఎస్సీ చేశారు. మాది ఉమ్మడి కుటుంబం. మా పిల్లలకు కూడా వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. మా ఆయన వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు చేసేదిశగా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. రైతు చేసే సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని, రైతులను అందరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అంటుంటారు. ముందుగా నేను హరిత క్రాంతి పథకంలో చేరి నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతను అమలు చేయడం దిశగా ముందడుగు వేశాను. నేను వంట చేయడం కోసం కలప తీసుకువెళ్లేదానిని. వాటిని సేకరించి, ఇంట్లో ఉంచినప్పుడు వాటికి చెదపురుగులు పట్టేవి. ఇవి వివిధ వివిధ పరిమాణాల్లో ఉండేవి. యూకలిప్టస్ (తెలుపు, నీలగిరి)కు చెదపురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. నిరంతర ప్రయోగాల తర్వాత తెల్లటి చెక్కను చెదపురుగులు ఇష్టంగా తింటాయని అర్థమైంది.


దీంతో గోధుమ పంటలో చెదపురుగుల నివారణకు.. తెల్లటి యూకలిప్టస్ చెట్టు కర్రలను పంట చుట్టూ ఉంచితే.. చెదపురుగులు అక్కడే ఉండిపోయి.. పంటలోకి చొరబడవని అనిపించింది. వెంటనే ఒక ఎకరం పొలంలో.. వంద చదరపు మీటర్లలో, రెండు అడుగుల పొడవు, రెండున్నర అంగుళాల మందం కలిగిన తెల్లటి కర్రను భూమికి సమాంతరంగా నాటాను. ఇందుకోసం ఆ కర్రలను సగం భూమి లోపల, సగం బయట ఉంచాను. ఈ విధంగా మొత్తం 40 కర్రలను ఉంచాను. ఫలితంగా గోధుమ పంటను ఆశించే చెదపురుగులు.. ఆ తెల్లటి కర్రల దగ్గరే ఆగిపోయాయి. ఫలితంగా ఎలాంటి పురుగు మందుల అవసరం లేకుండానే పంట చేతి కొచ్చింది. దీనిని వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి తెలియజేశాను. వారు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. ఏ పంటలోనైనా తెల్ల కర్రల వాడకంతో పాటు వేపతో నేలను శుద్ధి చేసిన తర్వాత నాణ్యమైన విత్తనాలు నాటితే చాలా మంచి ఫలితాలు వస్తాయని భగవతి దేవి తెలిపారు. ఈ నూతన ఆవిష్కరణల నేపధ్యంలో భగవతి దేవి జైపూర్‌లోని ‘సిటా’ నుంచి ‘ఖేతోం కె వైజ్ఞానిక్’, మహీంద్రా సమృద్ధి ఇండియా అగ్రి అవార్డ్స్‌లో ‘కృషి ప్రేరణా సమ్మాన్’.. ఇలా పలు అవార్డులు అందుకున్నారు.



Updated Date - 2021-11-29T13:47:49+05:30 IST