ప్రశ్నించేందుకు ప్రేరణనిచ్చేది భగవద్గీత : మోదీ
ABN , First Publish Date - 2021-03-12T00:01:45+05:30 IST
భగవద్గీత మనలో ఆలోచనలను, ప్రశ్నించే తత్వాన్ని ప్రేరేపిస్తుందని
న్యూఢిల్లీ : భగవద్గీత మనలో ఆలోచనలను, ప్రశ్నించే తత్వాన్ని ప్రేరేపిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇది చర్చను ప్రోత్సహిస్తుందని, మనసులను విశాలం చేస్తుందని తెలిపారు. భగవద్గీత వల్ల ప్రేరణ పొందినవారు ఎల్లప్పుడూ సహజమైన కారుణ్యభావంతో మెలగుతారని, వారి వ్యక్తిత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని వివరించారు. స్వామి చిద్భవానందజీ వివరించిన భగవద్గీత కిండిల్ వెర్షన్ పుస్తకాన్ని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు.
మోదీ మాట్లాడుతూ, ‘‘భగవద్గీత మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇది మనల్ని ప్రశ్నించేందుకు ప్రేరేపిస్తుంది. చర్చను ప్రోత్సహిస్తుంది, మన మనసుల్ని అరమరికలు లేకుండా ఉంచుతుంది. భగవద్గీత వల్ల ప్రేరణ పొందినవారెవరైనా స్వభావరీత్యా ఎల్లప్పుడూ కారుణ్య భావంతో మెలగుతారు, వ్యక్తిత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు’’ అని చెప్పారు.
కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లను విదేశాలకు సరఫరా చేయడం గురించి మాట్లాడుతూ, ఇటీవల ప్రపంచానికి మందులు అవసరమైనపుడు వాటిని భారత దేశం అందజేయగలిగిందని చెప్పారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు వెళ్తుండటం మన దేశానికి గర్వకారణమని తెలిపారు. మానవాళికి సాంత్వన చేకూర్చడంతోపాటు సహాయపడాలని మనం కోరుకుంటామన్నారు. దీనినే భగవద్గీత మనకు బోధించిందని వివరించారు.
స్వయం సమృద్ధ భారత దేశాన్ని సాధించాలనే లక్ష్యంలో ప్రధానమైనది సంపదను, విలువలను సృష్టించడమని చెప్పారు. ఈ సంపద, విలువలు కేవలం భారత దేశం కోసం మాత్రమే కాదని, యావత్తు మానవాళి కోసమని వివరించారు. స్వయం సమృద్ధ భారత్ వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందని నమ్ముతున్నామన్నారు.
స్వామి చిద్భవానందజీ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో శ్రీరామకృష్ణ తపోవనం ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన వివరణతో రాసిన భగవద్గీత పుస్తకం 5 లక్షల కాపీలను విక్రయించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.