దృష్టి పని మీద ఉండాలి!

ABN , First Publish Date - 2020-03-20T06:10:23+05:30 IST

భగవద్గీత గురించి ఒక్కమాటలో చెప్పమంటే ‘నిష్కామకర్మ’ అని చెప్పొచ్చు. దాని గురించి భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ వివరించాడు...

దృష్టి పని మీద ఉండాలి!

భగవద్గీత గురించి ఒక్కమాటలో చెప్పమంటే ‘నిష్కామకర్మ’ అని చెప్పొచ్చు. దాని గురించి భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ వివరించాడు. 


తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర

అసక్తో హ్యాచరన్‌ కర్మ పరమాప్నోతి పూరుషః


భగవంతుడు ఏదీ ఆశించకుండా పని చేయమని చెప్పడం లేదు. జీతం ఆశించకుండా ఉద్యోగం చేయం కదా! కాబట్టి ఫలితం ఆశించకుండా కాదు, ఫలితం మీద దృష్టి లేకుండా పనిచేయాలి. అదే అసక్తత! ఆశ లేకుండా జీవితం లేదు. ఆశ లేకుండా అభివృద్ధి లేదు. ‘కార్యం కర్మ’ అంటే చేయవలసిన కర్మ. అన్ని పనులూ మీద వేసుకోవడం కాదు. అవసరమైనవి మాత్రమే చేయాలి. అలాగే పనిమీదే దృష్టి పెట్టాలి. ఫలితం మీద  కాదు. రమణమహర్షిని ఒక వ్యక్తి నిష్కామకర్మ అంటే ఏంటని అడిగాడు. ‘‘రా చూపిస్తాను’’ అని ఆ వ్యక్తిని గిరిప్రదక్షిణకు తీసుకెళ్లాడు. మధ్యలో ఒక తుమ్మ చెట్టు దగ్గర రమణుడు ఆగి, విరిగిన కొమ్మ తీసుకొని, పదునైన రాయితో రెండు గంటల సేపు చెక్కి, నునుపుగా చేశాడు. మళ్లీ బయలుదేరాడు. దారిలో గొర్రెలు కాస్తున్న బాలుడు ఆయనను పలకరించాడు. ‘‘బాగున్నావా?’’ అంటూ ఆ కర్రను ఇచ్చాడు. ఆ బాలుడు సంతోషంగా అది తీసుకొని వెళ్ళాడు. తరువాత తన వెంట వస్తున్న ఆ వ్యక్తితో ‘‘నిష్కామకర్మ అంటే ఇది’’ అని ఆయన చెప్పాడు. ఆ కర్ర రమణమహర్షికి అవసరం లేదు. అయినా దాన్ని రాయితో చెక్కాడు. అది ఎవరికి అవసరమో వారికి ఇచ్చేశాడు. అదే నిష్కామకర్మ. ఫలితం మీద దృష్టి పెట్టకు. పని మీద దృష్టి పెట్టు. ఇది అందరూ పాటించాలి.


డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-03-20T06:10:23+05:30 IST