రోగి మెడికల్ స్టోర్ ముందే కుప్పకూలిపోయాడు...

ABN , First Publish Date - 2020-07-16T12:52:05+05:30 IST

మందులు కొనేందుకు మెడికల్ స్టోరుకు వచ్చిన ఓ రోగి అక్కడే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణించిన...

రోగి మెడికల్ స్టోర్ ముందే కుప్పకూలిపోయాడు...

6గంటల తర్వాత శవం తొలగింపు

భాగల్‌పూర్ (బీహార్): మందులు కొనేందుకు మెడికల్ స్టోరుకు వచ్చిన ఓ రోగి అక్కడే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణించిన హృదయవిదారక ఘటన బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ నగరంలో వెలుగుచూసింది. ఆస్తమాతో బాధపడుతున్న ఓ రోగి మెడికల్ షాపునకు వచ్చి ఆస్తమా పంపు కొన్నాడు. అనంతరం తిరిగి వెళుతూ మెడికల్ షాపు ముందే కుప్పకూలిపోయి మరణించాడు. మెడికల్ షాపు ముందు పడి ఉన్న మృతదేహాన్ని కరోనా భయంతో స్థానికులు ఎవరూ తొలగించేందుకు ముందుకు రాలేదు. తాము సమాచారం అందించగా అంబులెన్సు వచ్చినా కొవిడ్ భయంతో మృతదేహాన్ని తీసుకువెళ్లకుండానే తిరిగి వెళ్లిపోయింది. పోలీసులకు సమాచారం అందిస్తే వారు కూడా వచ్చి వెళ్లిపోయారని మెడికల్ షాపు యజమాని ముహ్మద్ ముస్తాఖ్ ఖాన్ చెప్పారు. కొవిడ్ కేర్ హెల్ప్ లైన్ కు తాము సమాచారం అందించినా వారు కూడా రాలేదని ఖాన్ పేర్కొన్నారు. మెడికల్ షాపు ముందు పడి ఉన్న మృతదేహాన్ని తొలగించాలని కోరుతూ తాము ఎస్పీ, డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ లను కోరినా వారి నుంచి కూడా స్పందన కనిపించలేదు. ఆరుగంటల తర్వాత డిప్యూటీ మేయరు జోక్యంతో పీపీఈ కిట్లు ధరించిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. కరోనా భయం ప్రజలను వెంటాడుతుండటంతో మృతదేహాల తరలింపునకు ఎవరూ ముందుకు రావడం లేదు. భాగల్ పూర్ పట్టణంలోనే 1000 కరోనా కేసులు వెలుగుచూశాయి. 

Updated Date - 2020-07-16T12:52:05+05:30 IST