భద్రకాళి బండ్‌పై ఇక ప్రైవేటు పెత్తనం

ABN , First Publish Date - 2022-09-28T05:45:40+05:30 IST

వరంగల్‌ భద్రకాళి బండ్‌ నిర్వహణ టెండరు ‘సుచిర్‌ ఇండియా’ సంస్థకు దక్కింది. మూడేళ్ల బండ్‌ నిర్వహణ లీజును ‘సుచిర్‌ ఇండియా’కు కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ అప్పగించింది.

భద్రకాళి బండ్‌పై ఇక ప్రైవేటు పెత్తనం

‘సుచిర్‌ ఇండియా’కు మూడేళ్ల లీజు ఖరారు
రూ.29కోట్ల పైచిలుకు ప్రాజెక్టుకు రూ.48 లక్షల టెండరు
ధర నిర్ణయింపుపై విమర్శలు
కూడబలుక్కొనే కట్టబెట్టారని విమర్శలు


హనుమకొండ సిటీ(సెప్టెంబరు 27): వరంగల్‌ భద్రకాళి బండ్‌ నిర్వహణ టెండరు ‘సుచిర్‌ ఇండియా’ సంస్థకు దక్కింది. మూడేళ్ల బండ్‌  నిర్వహణ లీజును  ‘సుచిర్‌ ఇండియా’కు కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ అప్పగించింది.  యేటా రూ.48 లక్షలు అద్దె చెల్లించే విధానంలో టెండర్‌ను అంతకంటే ఎక్కువ కోట్‌ చేసే సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. ఈమేరకు గత నెలలో టెండరు  నోటిషికేషన్‌ను జారీ చేశారు. టెండరులో సిరికో, అభితేజ్‌, ‘సుచిర్‌ ఇండియా’ సంస్థలు పాల్గొన్నాయి. అనేక పరిణామాల క్రమంలో చివరకు ‘సుచిర్‌ ఇండియా’కే టెండరు దక్కింది. మూడు సంస్థల్లో ఒకటైన అభితేజ్‌ టెండరు నిబంధనలకు అనుగుణమైన అర్హతలు లేవని తేల్చడంతో పక్కకు తొలగింది. ఇక టెండరుకు పోటీ పడ్డ సిరికో యేడాదికి రూ.48.20 లక్షలు కోట్‌ చేయగా, ‘సుచిర్‌ ఇండియా’ రూ.48.50లక్షల కోట్‌తో టెండరు వేసింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఖరారు చేసిన రూ.48లక్షల కంటే అదనంగా యేడాదికి రూ.50 వేలు మాత్రమే కోట్‌ చేసి  ‘సుచిర్‌ ఇండియా’ దక్కించుకోవడం గమనార్హం.  అంటే.. ‘కుడా’ నిర్ణయించిన ధర కంటే కేవలం నెలకు రూ.4,166 చొప్పున యేడాదికి రూ.50 వేలు ఎక్కువగా చెల్లింపుతో ‘సుచిర్‌ ఇండియా’ టెండర్‌ను దక్కించుకోవడం గమనార్హం.

విమర్శలు

‘సుచిర్‌ ఇండియా’కు ‘కుడా’ అప్పనంగా భద్రకాళి బండ్‌ను కట్టబెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘కుడా’ టెండరును యేడాదికి రూ.48 లక్షల ధరతో మూడేళ్ల లీజును నిర్ణయించడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హృదయ్‌ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.29కోట్లతో నిర్మితమైన భద్రకాళి బండ్‌ను నెలకు రూ.4లక్షల చొప్పున యేడాదికి రూ.48లక్షలు ‘కుడా’కు చెల్లింపు ధరగా నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువగా నిర్ణయించి లాభార్జన ఉద్దేశంతో వ్యవహరించాల్సిన ‘కుడా’ ప్రయివేట్‌ సంస్థలు, వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తోందనే ఆరోపణలు పెల్లుబికుతున్నాయి. ఇందులో బడాబాబులు, అధికార పక్ష నేతల జోక్యంతో పాటు ‘కుడా’ అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రకాళి బండ్‌ నిర్వహణ లీజు ‘సుచిర్‌ ఇండియా’ సంస్థకు దక్కడంలో కూడా అధికార పక్ష నేతల జోక్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘కుడా’ నిర్వహణలో కీలక బాధ్యతలు పోషించే వారితో పాటు ఓ మాజీ  కార్పొరేటర్‌, ఇతర నేతలు చక్రం తిప్పారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. సదరు సంస్థలో భాగస్వామ్యం కలిగి ఉండి టెండరు దక్కడంలో రింగు తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

Updated Date - 2022-09-28T05:45:40+05:30 IST