భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం
ABN , First Publish Date - 2020-04-04T10:12:19+05:30 IST
భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం
పట్టువస్త్రాలు సమర్పించిన కేవీ రమణాచారి
భద్రాచలం, ఏప్రిల్ 3 : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం శుక్రవారం జరిగింది. నూతన దంపతులైన సీతారామచంద్రస్వాములను పండితుల వేద పఠనం, మంగళ వాయిద్యాల నడుమ మండపానికి తోడ్కొని వచ్చారు. పట్టాభిషేక ఘట్టంలో ప్రధాన లాంఛనమైన సామ్రాట్ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేశారు. శ్రీరామచంద్ర మహాప్రభువుకు వేద ఆశీర్వచనం, అష్టోత్తర శతహారతి సమర్పించడంతో పట్టాభిషేకం పూర్తయింది. ఆ తర్వాత 500 నదీ జలాలు, నాలుగు సముద్ర జలాలను ఆవాహన చేసిన కలశ జలంతో రామయ్యకు ప్రోక్షణ గావించారు. కాగా, ప్రతి యేటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ సమర్పించే పట్టువస్త్రాలను ఈసారి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు కేవీ రమణాచారి అందజేశారు.