విహబ్, సెర్ప్ ద్వారా గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణ
ABN , First Publish Date - 2020-11-29T04:51:30+05:30 IST
సూక్ష్మ చిన్నతరహా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకొని స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన యువతీ యువకులు వారి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు విహబ్, సెర్ప్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో పోత్రు గౌతమ్ తెలిపారు.
భద్రాచలం ఐటీడీఏ పీవో పోత్రు గౌతమ్
భద్రాచలం, నవంబరు 28: సూక్ష్మ చిన్నతరహా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకొని స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన యువతీ యువకులు వారి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు విహబ్, సెర్ప్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో పోత్రు గౌతమ్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ భవనంలోని తన ఛాంబర్లో శనివారం ఎంఎస్ఎం యూనిట్, రైతు ఉత్పత్తిదారుల సంఘానికి సంబంధించిన యూనిట్ అధికారులతో పీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చిన్న వ్యాపారాలు, పచ్చళ్లు, నెయ్యి, వెన్న, కారం, పసుపు, ఇతర ఫుడ్ ప్రాసెస్కు సంబంధించి కొత్తగూడెం జిల్లాలో 75, ఖమ్మం జిల్లాలో 30 మందికి వారు చేస్తున్న వ్యాపార అభివృద్ధికి విహబ్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే సెర్ప్ ద్వారా రైతు, ఉత్పత్తిదారుల సంఘాలకు హార్వెస్టర్లు, ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ పరికరాలు అందించడానికి వ్యవసాయ విభాగం ద్వారా ప్రణాళికలు సిద్ధం చేయాలని పీవో తెలిపారు. సమావేశంలో ఏపీవో జనరల్ నాగోరావు, ఎస్వో సురేష్బాబు, ఏడీ అగ్రికల్చర్ సుజాత, డీపీఎం జి.సునంద, డీటీడీవో ప్రియాంక, ఖమ్మం డీపీఎం శ్రీనివాసు, ఏపీఎం జాబ్స్ వెంకన్న పాల్గొన్నారు.