ఊహించినదాని కన్నా ముందే తాలిబన్ల వశంలోకి కాబూల్!

ABN , First Publish Date - 2021-08-11T22:44:12+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్ అతి త్వరలో తాలిబన్ల

ఊహించినదాని కన్నా ముందే తాలిబన్ల వశంలోకి కాబూల్!

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్ అతి త్వరలో తాలిబన్ల వశంలోకి వెళ్ళబోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనా యంత్రాంగంలోని ఓ అధికారి అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ, తాము ఊహించినదానికన్నా ముందుగానే తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే మూడు నెలల్లో కాబూల్ తాలిబన్ల వశమవుతుందని అమెరికా సైన్యం అంచనా వేసినట్లు తెలిపారు. ఈ అధికారి తన పేరును బయటపెట్టవద్దని కోరినట్లు ఆ మీడియా సంస్థ తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్ ఈశాన్య ప్రావిన్స్ బడక్షన్ రాజధాని నగరం ఫైజాబాద్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన కొద్ది సేపటికే అమెరికన్ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. తాలిబన్లు ఆరు రోజుల్లో ఎనిమిది ప్రొవిన్షియల్ రాజధాని నగరాలను స్వాధీనం చేసుకున్నారు. బడక్షన్ సరిహద్దుల్లో తజకిస్థాన్, పాకిస్థాన్, చైనా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్ ఈశాన్య ప్రావిన్స్ ఇటీవలి వరకు ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ తాలిబన్ల ప్రాబల్యం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఫైజాబాద్ కూడా తాలిబన్ల వశమవడం ఆందోళనకరమని అమెరికా అధికారులు చెప్తున్నారు.


ఇదిలావుండగా, జో బైడెన్ వైట్ హౌస్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, ఆగస్టు 31నాటికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికన్ దళాలను పూర్తిగా ఉపసంహరించాలన్న నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇక తదుపరి చర్చలేమీ లేవన్నారు. 20 ఏళ్లకు పైగా సుమారు ఓ ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశామన్నారు. దాదాపు 3 లక్షల మంది ఆఫ్ఘనిస్థాన్ దళాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చామన్నారు. ఆప్ఘనిస్థాన్ నేతలు కలిసిరావాలన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికన్ దళాలను ఉపసంహరించుకుంటే, అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ఆఫ్ఘనిస్థాన్ గడ్డను ఉపయోగించుకోబోమని తాలిబన్లు అమెరికాకు హామీ ఇచ్చారు. కానీ కాల్పుల విరమణకు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకరించలేదు. 


Updated Date - 2021-08-11T22:44:12+05:30 IST