ఆ రాళ్లతో ప్రమాదమే

ABN , First Publish Date - 2021-08-31T05:30:00+05:30 IST

కొన్ని ఆరోగ్య సమస్యలను మనం గుర్తించే లోపునే... చాపకింద నీరులా ప్రమాదకరంగా మారుతాయి. మూత్రపిండాల్లో, పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళు ఇలాంటివే. కిడ్నీ స్టోన్స్‌ కన్నా గాల్‌ స్టోన్స్‌ వల్ల ప్రమాదం మరింత ఎక్కువ. అవి హఠాత్తుగా అత్యవసర పరిస్థితికి దారి తీస్తాయి. సమస్య మరింత ముదరక ముందే అప్రమత్తం...

ఆ రాళ్లతో ప్రమాదమే

కొన్ని ఆరోగ్య సమస్యలను మనం గుర్తించే లోపునే... చాపకింద నీరులా ప్రమాదకరంగా మారుతాయి. మూత్రపిండాల్లో, పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళు ఇలాంటివే. కిడ్నీ స్టోన్స్‌ కన్నా గాల్‌ స్టోన్స్‌ వల్ల ప్రమాదం మరింత ఎక్కువ. అవి హఠాత్తుగా అత్యవసర పరిస్థితికి దారి తీస్తాయి. సమస్య  మరింత ముదరక ముందే అప్రమత్తం కావాలి. 


కాలేయం దిగువన పియర్‌ పండు ఆకారంలో ఉండే పిత్తాశయం జీర్ణక్రియకు తోడ్పడుతూ ఉంటుంది. కాలేయంలో తయారయ్యే జీర్ణరసం, బైల్‌ డక్ట్‌ ద్వారా పిత్తాశయం గుండా చిన్న పేగుల్లోకి చేరుకుంటూ ఉంటుంది. పేగులు ఈ బైల్‌ను కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాయి. కాలేయం నుంచి స్రవించే బైల్‌ను పిత్తాశయం తనలో నిల్వ చేసుకుంటూ, దాన్లోని నీటిని వడగట్టి జీర్ణప్రక్రియ కోసం పేగుల్లోకి పంపిస్తూ ఉంటుంది. ఇలా పిత్తాశయం జీర్ణప్రక్రియలో ఓ రిజర్వాయర్‌లా, కన్వేయర్‌ వ్యవస్థలా పని చేస్తూ ఉంటుంది. ఏళ్ల తరబడి జరిగే ఈ ప్రక్రియ ఫలితంగా పిత్తాశయంలో లేదా బైల్‌ డక్ట్‌లో గాల్‌ స్టోన్స్‌ ఏర్పడతాయి. అయితే ఇవి నిజానికి రాళ్లు కావు. బైల్‌ రసాలే దీర్ఘకాలంలో రాళ్లుగా గట్టిపడతాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బైల్‌స్టోన్స్‌ ఏర్పడే వీలుంటుంది. వీటి పరిమాణం బియ్యం గింజ మొదలు గోల్ఫ్‌ బంతి వరకూ ఉండవచ్చు. ఇవి కాలేయం నుంచి పేగుల్లోకి స్రవించే బైల్‌కు అవరోధంగా మారతాయి. ఫలితంగా జీర్ణప్రక్రియ కుంటుపడుతుంది. ఈ రాళ్లు పిత్తాశయం పనితీరును దెబ్బతీయడమే కాకుండా, సమయానికి సమస్యను సరిదిద్దకపోతే శరీర జీవక్రియల మీద పరోక్ష ప్రభావం చూపిస్తాయి. 




లక్షణాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు

పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినా కొందర్లో ఎటువంటి లక్షణాలు తలెత్తకపోవచ్చు. బైల్‌ డక్ట్‌లో రాళ్లు ఇరుక్కుని తీవ్రమైన కడుపు నొప్పితో అత్యవసరంగా ఆస్పత్రికి చేరుకునే వారిలో, అంతకు ముందు బైల్‌స్టోన్స్‌కు సంబంధించి ఎటువంటి లక్షణాలూ కనిపించి ఉండకపోవచ్చు. ఇలాంటి అత్యవసర పరిస్థితి కొందరికి ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుంది. కొందర్లో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే...


  1. కడుపు నొప్పి, మరీ ముఖ్యంగా పొట్ట పై భాగంలో, వీపులో నొప్పి గంటల తరబడి వేధిస్తుంది
  2. చర్మం పసుపు రంగులోకి మారుతుంది
  3. జ్వరం
  4. వాంతులు
  5. అజీర్తి, పొట్ట ఉబ్బరం, అసిడిటీ, ఛాతీలో మంట మొదలైన జీర్ణ సంబంధ సమస్యలు


కారణాలు బోలెడు

గాల్‌స్టోన్స్‌లో రెండు రకాలుంటాయి. సాధారణంగా 80ు మందిలో కొలెస్ట్రాల్‌ గాల్‌ స్టోన్స్‌ ఏర్పడుతూ ఉంటాయి. ఇవి పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. రెండో రకం పిగ్మెంట్‌ గాల్‌ స్టోన్స్‌ ముదురు రంగులో చిన్నవిగా ఉంటాయి. బైల్‌ స్రావాల్లోని బైల్‌రుబిన్‌ కారణంగా ఇవి ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. అలాగే 25 నుంచి 45 ఏళ్ల వయస్కుల్లో ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది. అలాగే ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా కొనసాగుతుంది. అయితే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడానికి కొన్ని అంశాలు దోహదపడుతూ ఉంటాయి. అవేంటంటే...


  1. అధిక బరువు వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఫలితంగా పిత్తాశయం పూర్తి స్థాయిలో ఖాళీ అవకపోవడం మూలంగా రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి బైల్‌ స్టోన్స్‌కు ఓ కారణం అధిక బరువుగా చెప్పుకోవచ్చు.
  2. పోషకాహార లోపం. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోగా, అధిక మొత్తంలో కొవ్వుతో కూడిన పదార్థాలు తినడం వల్ల కూడా బైల్‌ స్టోన్స్‌ ఏర్పడే వీలుంటుంది.
  3. మధుమేహుల్లో అధిక మొత్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ (ఒక రకమైన శరీర కొవ్వు) ఉంటాయి. ఇవి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడానికి దోహదం చేస్తాయి.
  4. గర్భిణుల్లో, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలలో, మెనోపాజ్‌ లక్షణాలను తగ్గించుకోవడం కోసం హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ తీసుకునేవారిలో, శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పెరుగుతుంది. ఫలితంగా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతాయి.
  5. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు బైల్‌ రసంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా బైల్‌ స్టోన్స్‌ ఏర్పడతాయి.
  6. ఉపవాసాలు చేసే వారిలో పిత్తాశయం సరిపడా కుంచించుకుపోదు. ఫలితంగా దాన్లో రాళ్లు ఏర్పడే వీలు పెరుగుతుంది.
  7. వేగంగా శరీర బరువు కోల్పోయే వారిలో కూడా గాల్‌ స్టోన్స్‌ ఏర్పడే వీలుంటుంది.
  8. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు, అధిక బరువును క్రమపద్ధతిలో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పిత్తాశయ రాళ్ల తయారీకి కారణమయ్యే ఆరోగ్య సమస్యల మీద ఓ కన్నేసి ఉంచాలి.


శాశ్వత పరిష్కారం

లక్షణాలు ఇబ్బంది పెడుతున్నా, ఇబ్బంది పెట్టకపోయినా పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు తప్పనిసరిగా చికిత్స మొదలుపెట్టాలి. అరుదుగా ఇబ్బంది పెట్టే నొప్పికి మందులు వాడుకుంటున్నా, సర్జరీని నిర్లక్ష్యం చేయకూడదు. సర్జరీ చేయించుకునే వీలు లేని వాళ్లకు కొన్ని వారాలు, నెలలు లేదా జీవిత కాలం పాటు మందులు వాడుకోవలసి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించిన విధంగా పిత్తాశయంలో రాళ్లను తొలగించే పరిస్థితి ఉండదు. గాల్‌ స్టోన్స్‌ ఉన్నాయని తేలినప్పుడు సర్జరీతో పూర్తి పిత్తాశయాన్నే తొలగించుకోవలసి ఉంటుంది. ఇలా తొలగించుకోవడం వల్ల అదనంగా ఎటువంటి ఆరోగ్య నష్టం జరగదు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన, లేదా సమస్య ఉన్న పిత్తాశయంలోనే రాళ్లు తయారవుతాయి. కాబట్టి పనిచేయని ఆ అవయవాన్ని తొలగించక తప్పదు. ఇందుకు చింతించవలసిన అవసరం లేదు. పిత్తాశయం పని కాలేయం తీసుకుని తనలో తయారయ్యే బైల్‌ను నేరుగా పేగుల్లోకి స్రవిస్తూ ఉంటుంది. ఈ మార్పుకు శరీరం అలవాటు పడడం కోసం వైద్యులు సర్జరీ తర్వాత కొన్ని మందులను సూచిస్తూ ఉంటారు. అలాగే ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవలసి ఉంటుంది.




మూత్రపిండాల్లో రాళ్లకు వైద్యులు సూచించిన చికిత్సలతో పాటు తేలికపాటి చిట్కాలను కూడా పాటించవచ్చు. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడానికి తోడ్పడే ఆ చిట్కాలు ఇవే!

నిమ్మరసం: నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌లను కలిపి తాగాలి. వెంటనే నీళ్లు కూడా తాగాలి. ఈ చిట్కాను రోజులో రెండు నుంచి మూడు సార్లు, వరుసగా మూడు రోజుల పాటు పాటించాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ఒకటి నుంచి రెండు వారాల పాటు రోజుకు ఒక గ్లాసు చొప్పున 100శాతం పూర్తి నిమ్మరసం తాగాలి.

దానిమ్మ: ఉదయాన్నే పరగడుపున దానిమ్మ రసం తాగాలి. దానిమ్మ రసాన్ని ఉలవలతో తయారుచేసిన సూప్‌తో కలిపి మధ్యాహ్నం వేళ తాగాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి.

క్రాన్‌బెర్రీ: రోజుకు మూడు గ్లాసుల చొప్పున క్రాన్‌బెర్రీ రసం తాగాలి. ఇలా వారం నుంచి రెండు వారాల పాటు చేయాలి.

బ్లాక్‌ కరెంట్‌: ఈ పళ్లను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా తినాలి.

నీళ్లు: రోజుకు 8 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు.


పిత్తాశయ సమస్యలు పెంచే కొవిడ్‌

కొవిడ్‌ సోకిన వారిలో పిత్తాశయ సమస్యలు కూడా పెరిగే వీలుంటుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో శరీరంలోని ఇతర అవయవాలకు సంబంధించిన రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడిన విధంగానే పిత్తాశయానికి చెందిన రక్తనాళాలు కూడా ఇన్‌ఫ్లమేషన్‌కు గురై, వాటిలో రక్తం గడ్డలు ఏర్పడే వీలుంటుంది. ఫలితంగా పిత్తాశయం పనితీరు దెబ్బతింటుంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న రెండు నుంచి మూడు నెలల తర్వాత అజీర్తి, అసిడిటీ, కడుపులో నొప్పి మొదలైన లక్షణాలతో సమస్య బయల్పడుతూ ఉంటుంది. కొవిడ్‌కు ముందు నుంచీ పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించని వారిలో, కొవిడ్‌ సోకిన తర్వాత కొత్త లక్షణంగా నొప్పి మొదలయ్యే సందర్భాలు ఎక్కువ. కాబట్టి గాల్‌ స్టోన్స్‌తో అత్యవసర పరిస్థితి తలెత్తే లోపే సర్జరీతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.


అవన్నీ అపోహలే!

పిత్తాశయాన్ని తొలగించడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయనీ, బరువు పెరుగుతారనీ, పిల్లలు పుట్టరనీ అపోహలు ఉన్నాయి. నిజానికి పిత్తాశయం తొలగించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిరూపించే ఆధారాలు ఎక్కడా లేవు. ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అగ్నిపర్వతం లాంటి పిత్తాశయాన్ని భయపడుతూ మోయడం కంటే, సర్జరీతో తొలగించుకుని శాశ్వత విముక్తి పొందడం మేలు.


సర్జరీ కూడా ఒక మార్గం


గాల్‌ స్టోన్స్‌ ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి, వాటి పట్ల అలక్ష్యం వహించడం తగదు. ఆ రాళ్లు పిత్తాశయంలో కదలకుండా ఉండిపోవు. పరిమాణం పెంచుకుంటూ, అవి కదిలి గాల్‌బ్లాడర్‌ మెడ భాగంలో అడ్డుపడి పిత్తాశయం కుళ్లిపోయేలా చేయవచ్చు. రాయి జారి డక్ట్‌లోకి చేరుకుంటే అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌కు దారి తీస్తుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ఎండోస్కోపీతో రాయిని తొలగించి, స్టెంట్‌ వేయించుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ల్యాప్రోస్కోపీతో పిత్తాశయాన్ని తొలగించుకోవలసి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చికిత్స అందించేలోపే పరిస్థితి విషమించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టు తెలిసినప్పుడు ‘ప్లాన్‌డ్‌ ఎలక్టివ్‌ కోలో కోల్‌సిస్టెక్టమీ’ని ఎంచుకుని, వీలును బట్టి సర్జరీతో పిత్తాశయాన్ని తొలగించుకోవడం ఉత్తమం. 

- డాక్టర్‌ ఆనంద్‌ కుమార్‌,

సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌,

అనన్య హాస్పిటల్‌,

కూకట్‌పల్లి, హైదరాబాద్‌.




Updated Date - 2021-08-31T05:30:00+05:30 IST