ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో పురోగతి
ABN , First Publish Date - 2021-05-15T09:55:43+05:30 IST
ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో రాష్ట్రం పురోగతి సాధించిందని ఆక్సిజన్ సేకరణ బాధ్యతలు చూస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. రాష్ట్రంలో..
ఎక్కువ ఇవ్వాలని కేంద్రానికి సీఎం లేఖ
రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడి
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో రాష్ట్రం పురోగతి సాధించిందని ఆక్సిజన్ సేకరణ బాధ్యతలు చూస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రులకు విస్తృతంగా ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు. రాష్ట్రానికి కొత్తగా మరో మూడు ఐఎ్సవో ట్యాంకులు సహా మొత్తం ఆరు ట్యాంకులల లిక్విడ్ ఆక్జిజన్ సమకూరుతోందని శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. ఆదివారం 60 టన్నుల ఆక్సిజన్తో కృష్ణపట్నానికి రైలు వస్తుందని, ఇప్పటికే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లో రెండు కొత్త ట్యాంకుల్లో అధికారులు అక్సిజన్ నింపారని, ఒక్కో ట్యాంకులో 20 టన్నుల చొప్పున 40 టన్నులు శనివారం కృష్ణపట్నం చేరుకుంటుందని వివరించారు. ఒక్కో ప్రత్యేక రైలు ద్వారా మూడు ట్యాంకుల చొప్పున సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఒడిశాలోని వివిధ కర్మాగారాల నుంచి ఈ ఆక్సిజన్ను సేకరించి రైళ్ల ద్వారా రాష్ట్రానికి రప్పిస్తున్నామని తెలిపారు. గుజరాత్ జామ్ నగర్ రిలయన్స్ ఫ్యాక్టరీ నుంచి 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ రానుందని, శనివారం గుంటూరు రైల్వేస్టేషన్కు చేరుకుంటుందని పేర్కొన్నారు.
ూూూూూూూూూూూూూూూూూూూూూూూూూూూూూ
వైద్యులు కరోనా రోగులతో మాట్లాడాలి
నర్సులే మాట్లాడుతున్నారని ఫిర్యాదులొస్తున్నాయి: పేర్ని నాని
మచిలీపట్నం టౌన్, మే 14: రోజులో కనీసం ఒకసారైనా కరోనా రోగులతో వైద్యులు మాట్లాడి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కొవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్సపై ఆయన శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని మంత్రి కొనియాడారు. అయితే కరోనా రోగులతో వైద్యులు నేరుగా మాట్లాడటం లేదని, నర్సులు మాత్రమే మాట్లాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. వైద్యులు రోజుకొకసారైనా బాధితులతో మాట్లాడాలన్నారు. ఆక్సిజన్ సిలెండర్లపై ఆధారపడకుండా ఆక్సిజన్ కాన్సంట్రేట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆక్సిజన్ బెడ్లు పెంచుకోవాలన్నారు. రాబోయే పది రోజుల్లో ఆశ్రమ ఆస్పత్రిలో 400 ఆక్సిజన్ బెడ్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు మరో 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2,760 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, 9,458 మంది హోం ఐసొలేషన్లో ఉన్నారని, 779 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 42 ఆస్పత్రుల్లో 351 ఐసీయూ బెడ్లు, 1,190 ఆక్సిజన్ బెడ్లు, 1,406 నాన్ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.