కుదుటపడుతున్న జనజీవనం

ABN , First Publish Date - 2020-10-01T11:02:44+05:30 IST

జిల్లాలో జనజీవనం కుదుటపడుతోంది. కరోనా ప్రభావంతో దాదాపు ఆరు మాసాలుగా బయటకు వచ్చేందుకు భయపడిన

కుదుటపడుతున్న జనజీవనం

యథావిధిగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్వయం ఉపాధి, వృత్తి పనుల్లో కదలిక

ఊరట కలిగిస్తున్న ప్రజారవాణా

కార్యాలయాల్లో మెరుగైన పనులు

పట్టణాల్లో మళ్లీ రద్దీ వాతావరణం

పెరిగిన రాజకీయ కార్యకలాపాలు


ఒంగోలు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జనజీవనం కుదుటపడుతోంది. కరోనా ప్రభావంతో దాదాపు ఆరు మాసాలుగా బయటకు వచ్చేందుకు భయపడిన  ప్రజలు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఎవరికి వారు రోజువారీ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, వివిధ స్వీయ ఉపాధి, వృత్తి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రజా రవాణా రోడ్డెక్కడం, ప్రభుత్వ కార్యాలయాల్లో గతం కన్నా పనులు మెరుగవడం వంటివి ఊరట కలిగిస్తున్నాయి. దీంతో పల్లెల్లో జనజీవనం మెరుగు పడగా పట్టణాల్లో ఎప్పటిలాలే మళ్లీ రద్దీ వాతావరణం కనిపిస్తోంది.  రాజకీయ పక్షాల కార్యకలాపాలు కూడా పెరిగాయి. ప్రతిపక్షాలు వివిధ అంశాలపై నిరసనలు, ఆందోళనలు చేపడుతుండగా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాలను పెంచారు.


కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం విదితమే. దాదాపు రెండు నెలలకు పైగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలైంది. తర్వాత క్రమంగా పలు  రంగాలపై ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. అయితే జిల్లాలో కరోనా ఉధృతి నేపథ్యంలో జూలై, ఆగస్టుల్లో అత్యధిక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగాయి.  ఇలా దాదాపు ఐదారు మాసాలు అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో పడిపోయి ఇంచుమించు పదివేల కోట్ల రూపాయాల ఆర్థిక లావాదేవీలు విఘాతం కలిగింది. దాదాపుఐదారు లక్షల కుటుంబాలకు చెందిన పేద, మద్య తరగతి వర్గాలకు చెందిన వారు పూట గడవని పరిస్థితికి చేరుకున్నారు. 


నెల నుంచి పరిస్థితిలో కొంత మార్చు వచ్చింది. కరోనా ఉధృతి పూర్తిగా తగ్గకపోయినప్పటికీ జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఈక్రమంలో ప్రభుత్వ వైపు నుంచి ఆంక్షలు తొలగింపు వేగవంతమైంది. అదేసమయంలో వారం, పదిరోజులుగా జిల్లాలో కరోనా ఉధృతి కొంత తగ్గింది. దీంతో జనజీవనం గాడిలో పడింది.  అన్ని రకాల వ్యాపారాలు, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు జిల్లావ్యాప్తంగా గతంలో మాదిరి సాగుతున్నాయి.  భవన నిర్మాణ, చిరు వ్యాపారం, మోటారు రంగం ఇతరత్రా అన్నీ పునఃప్రారంభమయ్యాయి. ఆర్టీసీ  బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ మెరుగుపడింది. దీంతో మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొంటోంది.  

Updated Date - 2020-10-01T11:02:44+05:30 IST