మెరుగైన చికిత్స అందించాలి
ABN , First Publish Date - 2021-05-11T04:46:35+05:30 IST
కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.చందూనాయక్ కొవిడ్ కేర్ సెంటర్ సిబ్బందికి సూచించారు.
- డీఎంహెచ్ఓ డాక్టర్ చందూనాయక్
గద్వాల అర్బన్, మే 10 : కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.చందూనాయక్ కొవిడ్ కేర్ సెంటర్ సిబ్బందికి సూచించారు. జిల్లా ఆసుపత్రి ఆవరణలోని కొవిడ్ కేర్ సెంటర్ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. బాధితులకు అందుతున్న చికిత్సకు సంబంధించి ఆరా తీశారు. అవసరమైన మేర మందులు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని, బాధితులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. బాధితుల ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తగా సేవలందించాలని చెప్పారు. అనంతరం రికార్డులు, రిపోర్టులు, కేస్షీట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యాధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్, ఆర్ఎంఓ డాక్టర్ వృశాలి, ల్యాబ్ మేనేజర్ రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించాలి
రాజోలి : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యాధి కారి డాక్టర్ మాల కొండయ్య అన్నారు. మండల కేంద్రమైన రాజోలిలో కరోనా బారిన పడ్డ వారి ఇళ్ల చుట్టూ, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో సోమవారం సోడియం హైడ్రోక్లోరైడ్ను పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదన్నారు. కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ జయప్రకాష్, హెల్త్ అసిస్టెంట్ రంజిత్ కుమార్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
గద్వాల అర్బన్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజ్కుమార్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ రత్నకుమారి సూచించారు. పట్టణంలోని సోమవారం రాజ్కుమార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ రాజ్కుమార్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా టైలరింగ్, కంప్యూటర్స్, హోమ్కేర్, మగ్గం వర్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తుందన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని, ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సరిహద్దులో బారికేడ్లు
రాజోలి : మండల కేంద్రమైన రాజోలి శివారులోని సుంకేసుల డ్యాంపై సోమవారం బారికేడ్లు ఏర్పాటు చేశారు. పొరుగురాష్ట్రం నుంచి తెలంగాణలోకి రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకు న్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను నిలిపివేసి, సరిహద్దులను మూసేస్తున్నట్లు రాజోలి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఏపీలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నందున సరిహద్దులను దాటి ఎవరూ వెళ్లరాదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెక్పోస్టులో మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతినగర్ ఎస్ఐ శ్రీహరి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.