navaratri diet: నవరాత్రి ఉపవాస సమయంలో ఈ పండ్లను తప్పక తినండి.. నీరసం, ఆకలి దరిచేరవు!
ABN , First Publish Date - 2022-09-26T13:38:10+05:30 IST
నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా...
నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉపవాసం చేసేవారు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు, ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏదో ఒకటి తినవలసి వస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి పండ్లు తినడం ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం చేసే తొమ్మిది రోజులు ఫిట్గా ఉండేందుకు కొన్ని ప్రత్యేక ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఉపవాసం చేసే రోజుల్లో ప్రతి 2 గంటలకు ఒకటి లేదా రెండు పండ్లు తినడం ద్వారా ఉత్సాహంగా ఉండవచ్చు. ఆ పండ్లు ఏమిటో అవి అందించే శక్తి ఎటువంటిదో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండు
విటమిన్లు, మినరల్స్, ఫైబర్తో పాటు పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, మెగ్నీషియం కలిగిన అరటిపండ్లను తింటే రోజంతా శక్తి సమకూరుతుంది. ఆకలి వేయదు. అరటిపండు బీపీ, కొలెస్ట్రాల్లను కంట్రోల్ చేస్తుంది. మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను తినడం మంచిదికాదు.
బత్తాయి
బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బత్తాయిలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవచ్చు. బత్తాయిలో నీరు, ఫైబర్ ఉంటాయి. బత్తాయిలు మనల్ని రోజంతా హైడ్రేట్గా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయని రుజువయ్యింది. నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు బత్తాయి పండ్లను తినడం ఉత్తమం.
బ్లూబెర్రీస్
బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో మంచి పరిమాణంలో నీరు కూడా ఉంటుంది. ఉపవాస సమయంలో నీరసం తలెత్తకుండా ఉండేందుకు బ్లూబెర్రీలను తినడం ఉత్తమం. బ్లూబెర్రీస్ తినడం వలన అనేక శారీరక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రేగు పండ్లు
రేగు పండ్లను తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది. శరీరానికి పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. తద్వారా నీరసంగా అనిపించదు. ఉపవాస సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రేగు పండ్లను తినవచ్చు.
యాపిల్
నవరాత్రి ఉపవాస వేళలో యాపిల్స్ తినడం ఉత్తమం. తద్వారా శరీరానికి పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. దీనితోపాటు కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి. యాపిల్ తింటే శరీరం శక్తివంతంగా ఉంటుంది.