బెంగళూరులో ప్రముఖ రహదారికి పునీత్ పేరు
ABN , First Publish Date - 2021-11-04T17:56:57+05:30 IST
రాజధాని బెంగళూరులో ఏదైనా ప్రముఖ రహదారికి పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ పేరు పెట్టాలని బీబీఎంపీ పరిశీ లిస్తోంది. పార్టీలకు అతీతంగా మాజీ కార్పోరేటర్లు పెద్ద సంఖ్యలో ఈ మేరకు బీబీఎంపీకి విజ్ఞప్తి చేశారు. పలు కన్నడ
బెంగళూరు(Karnataka): రాజధాని బెంగళూరులో ఏదైనా ప్రముఖ రహదారికి పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ పేరు పెట్టాలని బీబీఎంపీ పరిశీ లిస్తోంది. పార్టీలకు అతీతంగా మాజీ కార్పోరేటర్లు పెద్ద సంఖ్యలో ఈ మేరకు బీబీఎంపీకి విజ్ఞప్తి చేశారు. పలు కన్నడ సంఘాలు కూడా ఇదే అంశంపై బీబీఎంపీపై వత్తిడి ప్రారంభించాయి. ఇలా చేయడం వల్ల జాతీయస్థాయి పురస్కారం పొందిన ఒక నటుడికి సముచిత గౌరవం కల్పించినట్లు కాగలదని కన్నడ సంఘాలు పేర్కొంటున్నాయి. బీహెచ్ఈఎల్ సర్కిల్ నుంచి మైసూరు శాండల్సోప్ ఫ్యాక్టరీ వరకు సాగే 8 కిలోమీటర్ల పొడవైన రహదారి కి ఇంకా ఎవరి పేరును పెట్టలేదు. ఈ మార్గానికి పునీత్ పేరు పెట్టడం అన్ని విధాలా సముచితంగా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పునీత్పేరును ప ద్మశ్రీ కోసం సిఫారసు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే.
నగరంలోని ఒక సినిమా థియేటర్కు కూడా పునీత్ పేరుపెట్టే అంశాన్ని పరిశీలిస్తు న్నట్లు తెలుస్తోంది. కాగా రాజాజినగర్లోని వెస్ట్ ఆఫ్ కా ర్డ్ రోడ్డుకు పునీత్ పేరు పెట్టాలని బీబీఎంపీ కమిషనర్ గౌరవ్గుప్తకు, పాలనాధికారి రాకేశ్సింగ్కు విజ్ఞప్తి చేయాలని బెంగళూరు దక్షిణ బీజేపీ నిర్ణయించింది.
గుండెపోటుతో పునీత్ అభిమాని మృతి
పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అభిమాని మరొకరు గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన తుమకూరు జిల్లాలో సంభవించింది. బెంగళూరులో రెండురోజుల పాటు పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించి సొంతూరు హీరేహళ్ళికి చేరుకున్న అభిమాని అప్పు శ్రీనివాస్ (32)కు గుండెపోటు వచ్చింది. చికిత్స పొందుతూ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం మృతిచెందాడని కుటుంబీకులు వెల్లడించారు. పునీత్ మృతితో కుంగిపోయాడన్నారు. కాగా హెబ్బూరులో అభిమాని భరత్ ఆత్మహత్య విదితమే.