alert: బెంగళూరులో 301మంది పిల్లలకు కరోనా
ABN , First Publish Date - 2021-08-12T16:33:26+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఒక్కసారిగా పిల్లలకు కరోనా సోకడంతో వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది...
బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఒక్కసారిగా పిల్లలకు కరోనా సోకడంతో వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.బెంగళూరు నగరంలో కేవలం 6రోజుల వ్యవధిలో 301 కరోనా కేసులు వెలుగుచూడటంతో నగరంలో అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 5 నుంచి 10వతేదీల్లోపు 127 మంది పదేళ్ల లోపు పిల్లలకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతోపాటు మరో 174 మంది 10 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు కొవిడ్ మహమ్మారి సోకింది. పిల్లలకు కరోనా సోకుతుండటంతో బృహత్ బెంగళూరు మహానగర పాలిక, కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖలు అప్రమత్తమై కరోనా కట్టడి చర్యలు చేపట్టాయి. పిల్లలకు కరోనా రాకుండా టీకాలను ఇంకా ఆమోదించని సమయంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా ఇన్ఫెక్షన్తో పోరాడటానికి వారికి యాంటీబాడీస్ అందించే టీకాలు వేయలేదు. దీంతో భారతదేశంలో మూడవ వేవ్ సమయంలో పిల్లలు కొవిడ్ -19 బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.కొన్ని రోజుల్లో పిల్లల్లో కొవిడ్ -19 కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగే ప్రమాదముందని పేరు చెప్పని ఓ అధికారి చెప్పారు. పిల్లల్ని ఇంటి లోపల ఉంచి కరోనా రాకుండా కాపాడాలని వైద్యులు తల్లిదండ్రులను కోరుతున్నారు.పిల్లలకు కరోనా సోకిన నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు బెంగళూరు నగరంలో పోలీసులు 144 సెక్షన్ ను విధించారు.