వీసా కోసం వచ్చి హోటల్లో బస.. విషాదాన్ని మిగిల్చిన హోటల్ భోజనం..
ABN , First Publish Date - 2020-02-12T15:47:47+05:30 IST
అమెరికా వెళ్లేందుకు వీసా స్టాంపింగ్ కోసం నగరానికి వచ్చారు.. డబ్బు ఖర్చయినా ఫర్లేదనుకుని కాస్త ఖరీదైన హోటల్లోనే దిగారు! తాజాగా, నాణ్యంగా ఉంటుందనుకుని అదే హోటల్లోని భోజనం తెప్పించుకుని తిన్నారు.
త్రీస్టార్ హోటల్లో కలుషితాహారం!
అపస్మారక స్థితిలోకి వెళ్లి
రెండేళ్ల బాలుడి మృతి
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆస్పత్రి పాలు
వీసా కోసం వచ్చి హోటల్లో బస... బేగంపేటలో ఘటన
బాధితులు ఖమ్మం జిల్లా పెనుబల్లి వాసులు
బేగంపేట(హైదరాబాద్): అమెరికా వెళ్లేందుకు వీసా స్టాంపింగ్ కోసం నగరానికి వచ్చారు.. డబ్బు ఖర్చయినా ఫర్లేదనుకుని కాస్త ఖరీదైన హోటల్లోనే దిగారు! తాజాగా, నాణ్యంగా ఉంటుందనుకుని అదే హోటల్లోని భోజనం తెప్పించుకుని తిన్నారు. అదే ఆ కుటుంబాన్నంతటినీ ఆసుపత్రి పాల్జేసింది. రెండేళ్ల వారి కుమారుడి ప్రాణం తీసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగంగూడెంకు చెందిన ఏటూరి రవినారాయణరావు, శ్రీ విద్య దంపతులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు వరుణ్, విహాన్(2). అమెరికా వెళ్లేందుకు ఇటీవల వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పని మీద ఆదివారం హైదరాబాద్ వచ్చారు. అమెరికా కాన్సులేట్కు దగ్గర్లో ఉంటుందని బేగంపేటలోని హోటల్ మానస సరోవర్లో రూం నంబరు 318లో దిగారు.
సోమవారం కాన్సులేట్కు వెళ్లి వేలిముద్రలు ఇచ్చి.. హోటల్కు తిరిగి వచ్చారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా హోటల్లోనే చేశారు. రాత్రికి బ్రెడ్ బాస్కెట్, కడాయ్ పన్నీర్ తెప్పించుకుని తిన్నారు. ఆ కాసేపటికే విహాన్, శ్రీవిద్య వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. కొద్దిసేపటికి వరుణ్, రవినారాయణరావు తీవ్రమైన కడుపు నొప్పికి గురయ్యారు. దీంతో నారాయణరావు నగరంలో ఉండే బంధువు ప్రసాద్ను పిలిచి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది హోటల్కు తిరిగొచ్చాడు. మంగళవారం ఉదయం చూసేసరికి విహాన్ అపస్మారక స్థితిలో కనిపించాడు. పెదవులు నల్లగా మారాయి. వెంటనే కిమ్స్ తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నారాయణరావు, శ్రీవిద్య, వరుణ్ ఆసుపత్రిలో చేరారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.