ఉచిత విద్యుత్కు లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-07-31T05:36:35+05:30 IST
ఉచిత విద్యుత్ పొందేందుకు రజక, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శరత్ కోరారు.
కామారెడ్డి, జూలై 30: ఉచిత విద్యుత్ పొందేందుకు రజక, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శరత్ కోరారు. శుక్రవారం తన చాంబర్లో నాయీ బ్రాహ్మణ, రజక కమ్యూనిటీలు నిర్వహిస్తున్న హెయిర్కటింగ్ సెలూన్లు, దోభీఘాట్లు, లాండ్రిషాపులకు ప్రభుత్వం ప్రకటించిన 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్క షాపు యజమాని లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాత కనెక్షన్ ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా, కొత్తవారు కూడా కనెక్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు.