నోయిడా ఎయిర్పోర్ట్ ఫేక్ ఫొటోలు.. బీజేపీని ‘బీజింగ్ జనతా పార్టీ’గా అభివర్ణించిన మల్లికార్జున ఖర్గే
ABN , First Publish Date - 2021-11-28T02:12:12+05:30 IST
నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి బీజేపీ నేతలు ఫేక్ ఫొటోలు షేర్ చేయడంపై
న్యూఢిల్లీ: నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి బీజేపీ నేతలు ఫేక్ ఫొటోలు షేర్ చేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ పార్టీ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బీజేపీపై దుమ్మెత్తి పోశారు. ఆ పార్టీని ‘బీజింగ్ జనతా పార్టీ’గా అభివర్ణించారు. అరుణాచల్ ప్రదేశ్లో గ్రామాలు నిర్మించుకోవడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతిస్తుంటే, ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం చైనా విమానాశ్రయాన్ని తనదిగా చూపిస్తోందంటూ ట్వీట్ చేశారు.
జెవార్లో నిర్మించ తలపెట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న శంకుస్థాపన చేశారు. అయితే, అంతకుముందే కొందరు బీజేపీ నేతలు బీజింగ్ డాగ్జింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫొటోలను షేర్ చేస్తూ ఇది పూర్తయితే లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.
దీనికి స్పందనగానే ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాకు లొంగిపోయిన ప్రభుత్వం లడఖ్లో మన భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేసిందని, బీజేపీ కాస్తా ‘బీజింగ్ జనతా పార్టీ’గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.