బీజేపీ నాయకులకు మరో భంగపాటు
ABN , First Publish Date - 2021-11-28T08:22:15+05:30 IST
బీజేపీ నాయకులకు మరోసారి భంగపాటు ఎదురైంది. నోయిడాలో నిర్మించనున్న జేవార్ విమానాశ్రయం ఇలా ఉంటుందంటూ ఓ ఫొటోను ఆ పార్టీ నేతలు ట్విటర్లో పోస్టు చేశారు.
నోయిడా విమానాశ్రయ నమూనా ఇదే
అంటూ బీజింగ్ ఎయిర్పోర్టు ఫొటో పోస్టు
న్యూఢిల్లీ, నవంబరు 27: బీజేపీ నాయకులకు మరోసారి భంగపాటు ఎదురైంది. నోయిడాలో నిర్మించనున్న జేవార్ విమానాశ్రయం ఇలా ఉంటుందంటూ ఓ ఫొటోను ఆ పార్టీ నేతలు ట్విటర్లో పోస్టు చేశారు. అయితే అది చైనాలోని బీజింగ్ విమానాశ్రయ ఫొటో. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, అర్జున్ రామ్ మేఘవాల్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు ఈ ఫొటోను ట్విటర్లో పోస్టు చేశారు. ‘‘నోయిడాలో నిర్మించే ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దది. దీం తో ఈ ప్రాంతానికి రూ.35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో బీజేపీ నేతల దుష్ప్రచారం మరోసారి బట్టబయలైందని చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(జీటీఎన్) విమర్శించింది. బీజేపీ నేతలు పోస్టు చేసినది బీజింగ్లోని ‘డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయ’ ఫొటో అని తెలిపింది.