వెటర్నరీలో పశు వైద్యులకు శిక్షణ ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-05T07:28:31+05:30 IST
రైతుల ఆదాయం పెంపునకు పశువైద్యులు కృషి చేయాలని తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆదిలక్ష్మమ్మ సూచించారు.
తిరుపతి(విద్య), మార్చి 4: రైతుల ఆదాయం పెంపునకు పశువైద్యులు కృషి చేయాలని తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆదిలక్ష్మమ్మ సూచించారు. కళాశాల విస్తరణ విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పశువైద్యులకు ఏర్పాటు చేసిన మూడ్రోజుల శిక్షణను గురువారం ఆమె ప్రారంభించి, ప్రసంగించారు. పశువైద్య పరిజ్ఞానాన్ని రైతులదరికి చేర్చాలని సూచించారు. ఇందులో భాగంగా న్యూట్రిషన్ విభాగం ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో రేషన్ తయారీ, సంకీర్ణ పశుగణాల శిక్షణ విభాగం ఆధ్వర్యంలో పశుగ్రాసం సాగులో కొత్త పద్ధతులు, పరాన్న జీవశాస్త్రం ఆధ్వర్యంలో వివిధ పరాన్నజీవులు-వాటి నివారణకు తగు చర్యలు, క్లినికల్ విభాగం ఆధ్వర్యంలో గర్భకోశ, పొదుగువాపు వ్యాధులపై శిక్షణ ప్రారంభించారు. విస్తరణ విభాగం హెడ్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జీఆర్కే శర్మ, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పశువైద్యులు పాల్గొన్నారు.