ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-30T06:04:04+05:30 IST

జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల, హిందీ ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు నిర్వహించనున్న వృత్యంతర శిక్షణ బుధవారం తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది.

ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ప్రారంభం
కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న డీఈవో చంద్రకళ

పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ

విశాఖపట్నం, జూన్‌ 29: జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల, హిందీ ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు నిర్వహించనున్న వృత్యంతర శిక్షణ బుధవారం తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధమైన బోధన ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని సూచించారు.


మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని పాఠశాలల పునఃప్రారంభం తర్వాత పిల్లల్ని తీర్చిదిద్దాలని సూచించారు. తొలిరోజు ఆంగ్ల పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ అందజేశారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరైన తొలిరోజే జగనన్న విద్యాకానుక, పాఠ్యపుస్తకాలు అందించాలని సూచించారు. డీఈవో సాయంత్రం వరకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.


ఈ కార్యక్రమంలో భీమిలి డైట్‌ ప్రిన్సిపాల్‌ మాణిక్యంనాయుడు, ఎస్‌ఎస్‌ఏ, ఏపీసీ అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసరావు అవగాహన తరగతులను పరిశీలించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి 240 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల హెచ్‌ఎం దుర్గాభవాని పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-30T06:04:04+05:30 IST