బిడ్డ కళ్లు తెరవక ముందే.. కరోనాతో తల్లి కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-06T08:09:18+05:30 IST

కరోనా సోకిన ఆ తల్లి, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ.. ఆ బిడ్డను తనివితీరా చూసుకోకుండానే, పసికందు కళ్లు తెరవకుండానే ఆ తల్లి కన్నుమూసింది.

బిడ్డ కళ్లు తెరవక ముందే.. కరోనాతో తల్లి కన్నుమూత

దుబ్బాక, మే 5: కరోనా సోకిన ఆ తల్లి, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ.. ఆ బిడ్డను తనివితీరా చూసుకోకుండానే, పసికందు కళ్లు తెరవకుండానే ఆ తల్లి కన్నుమూసింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో ఈ విషాదం చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన యువతికి, దుబ్బాకకు చెందిన యువకుడితో ఏడాది క్రితం కులాంతర వివాహం అయింది. పెళ్లైన వెంటనే గర్భం దాల్చిన యువతికి తాజాగా పురిటి నొప్పులు రావడంతో వెంటనే దుబ్బాక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో హైదరాబాద్‌కు తరలించాలని స్థానిక వైద్యులు సూచించారు. అక్కడి నుంచి గజ్వేల్‌ జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారు కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. చివరికి గాంధీ ఆసుపత్రికి తరలించగా.. మంగళవారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ కళ్లు తెరచి బిడ్డను చూసుకోకముందే తనువు చాలించింది.  

Updated Date - 2021-05-06T08:09:18+05:30 IST