కిడ్నాప్‌ నాటకమాడిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-25T06:54:33+05:30 IST

గుర్తుతెలియని వ్యక్తులు తనను అపహరించి, అత్యాచారయత్నం చేశారని నాటకమాడిన బీఫార్మసీ విద్యార్థిని అత్మహత్య చేసుకుంది.

కిడ్నాప్‌ నాటకమాడిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

  • 15 షుగర్‌ మాత్రలు మింగిన యువతి
  • నోటి నుంచి నురగలు రావడంతో ఆసుపత్రికి
  • అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు
  • పోలీసుల అత్యుత్సాహం వల్లే ఆత్మహత్య
  • హెచ్చార్సీలో ఓ న్యాయవాది పిటిషన్‌

మేడ్చల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 24: గుర్తుతెలియని వ్యక్తులు తనను అపహరించి, అత్యాచారయత్నం చేశారని నాటకమాడిన బీఫార్మసీ విద్యార్థిని అత్మహత్య చేసుకుంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసు విచారణ పూర్తయిన అనంతరం విద్యార్థిని ఘట్‌కేసర్‌లోని తన అమ్మమ్మ ఇంట్లోనే ఉంటోంది. జరిగిన సంఘటనలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అప్పట్నుంచీ ఆహారం సక్రమంగా తీసుకోవట్లేదు. మంగళవారం అనారోగ్యంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి.. గాంధీ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. గాంధీ వైద్యులు పరీక్షించి.. మానసిక ఒత్తిడి వల్లనే అలా ఉందని తెలిపి, బుధవారం ఉదయం మరోసారి ఆస్పత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు. 


దీంతో ఆమెను తీసుకుని తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. విద్యార్థిని తండ్రి షుగర్‌, బీపీ మాత్రలు వేసుకుందామని చూడగా.. వాటిలో 15 మాత్రల దాకా తక్కువ ఉన్నట్టు గమనించారు. ఆ మాత్రలు మింగడం వలనే మంగళవారం తమ కుమార్తె అస్వస్థతకు గురైందని నిర్ధారించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాంధీ ఆసత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం యువతి అమ్మమ్మ ఇంటివద్దే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-25T06:54:33+05:30 IST