భల్లూకం.. కల్లోలం

ABN , First Publish Date - 2021-02-23T05:49:25+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పట్టు బిగించింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టాల్లో ముగిశాయి. సోమవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,145.44 పాయింట్లు పతనమై 49,744.32 వద్దకు జారుకుంది...

భల్లూకం.. కల్లోలం

  • సెన్సెక్స్‌ 1,145 పాయింట్లు పతనం 
  • రూ.3.72 లక్షల కోట్లు ఆవిరి 

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పట్టు బిగించింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టాల్లో ముగిశాయి. సోమవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,145.44 పాయింట్లు పతనమై 49,744.32 వద్దకు జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 306.05 పాయింట్లు క్షీణించి 14,675.70 వద్ద స్థిరపడింది. రెండు నెలల్లో సూచీలకిదే అతిపెద్ద పతనం.  సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ 4.77 శాతం నష్టంతో టాప్‌ లూజర్‌గా నిలిచింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ సైతం 4 శాతానికిపైగా పతనమయ్యాయి. ఓఎన్‌జీసీ మాత్రం 1.14 శాతం బలపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ అర శాతానికి పైగా పెరిగాయి. బ్లూచి్‌పలతో పాటు చిన్న, మధ్య, బడా స్థాయి కంపెనీలు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ స్‌ఈ ఎనర్జీ సూచీ అత్యధికంగా 2.92 శాతం క్షీణించింది. రియల్టీ, ఐటీ, టెక్నాలజీ, మెటల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, యుటిలిటీస్‌ రంగ సూచీలు సైతం 2 శాతానికి పైగా నష్టపోవాల్సి వచ్చింది. భారత మార్కెట్లో ఊగిసలాటలకు సంకేతమైన వీఐఎక్స్‌ సూచీ 14 శాతం పెరిగి 25.47కు ఎగబాకింది. 


భారీ పతనానికి కారణాలు

  1. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు 
  2. బాండ్‌ మార్కెట్లలో వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం 
  3. మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం 
  4. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా ఎగబాకుతుండటం
  5. గతంలో మార్కెట్‌ ర్యాలీతో కంపెనీల షేర్లు గరిష్ఠ స్థాయిలకు చేరుకోవడం
  6. గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతుండటం 
  7. ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టుల ముగింపు వారం కావడంతో ఊగిసలాటలు 


నిమిషానికి రూ.1,000 కోట్లు ఫట్‌ 

అమ్మకాలు పోటెత్తడంతో స్టాక్‌ మార్కెట్‌ సంపద నిమిషానికి రూ.1,000 కోట్లకు పైగా హరించుకుపోయింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 3.72 లక్షల కోట్లు పతనమై రూ.200.26 లక్షల కోట్లకు పడిపోయింది. 


ఈ ఏడాది 75 డాలర్లకు క్రూడ్‌! 

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత ఎగబాకాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ పీపా రేటు సోమవారం నాడు ఒక దశలో 64.07 డాలర్లు పలికింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ముడి చమురు ధరలు 22 శాతం మేర పెరిగాయి. ఏడాది చివరి నాటికి మరో 20 శాతం వరకు పెరిగి 75 డాలర్లకు చేరుకోవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. 


  • ఐదు రోజుల నష్టం 
  • (పాయింట్లలో)
  • సెన్సెక్స్‌ :  2,409.81
  • నిఫ్టీ      :   639.00

Updated Date - 2021-02-23T05:49:25+05:30 IST