థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి
ABN , First Publish Date - 2021-12-02T05:42:54+05:30 IST
కొవిడ్ థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధం కావాలని అధికారులను కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.
- వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి
- అధికారులకు కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశం
కర్నూలు(కలెక్టరేట్), డిసెంబరు 1: కొవిడ్ థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధం కావాలని అధికారులను కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కొవిడ్ థర్డ్ వేవ్పై ఆర్డీవోలు, కొవిడ్-19 నోడల్ అధికారులు, జిల్లా అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, ఆసుపత్రులను సిద్ధం చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని సూచించారు. డిసెంబరు, జనవరిలో సెకండ్ డోసు ఇవ్వాల్సి వస్తుందని గుర్తు చేశారు. సచివాలయాల వారీగా ఆ వివరాలను పంపించి టీకాలు వేయాలని సూచించారు. గడిచిన 15 రోజులలో నమోదైన కొవిడ్ కేసుల వివరాలను విశ్లేషించుకుని, ట్రేసింగ్, టెస్టింగ్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని అవసరాన్ని బట్టి హోం ఐసొలేషన్లో ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు కలిసి జ్వరపీడితులను గుర్తించాలని ఆదేశించారు. 104 కాల్ సెంటర్ను వినియోగంలోకి తేవాలని సూచించారు. ఎంప్యానల్ ఆసుపత్రుల్లో వసతులను కూడా అధికారులు పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డి-టైప్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఎంహెచ్వో డా.రామగిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.