కొవిడ్, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-07-07T05:47:09+05:30 IST
జిల్లాలో కొవిడ్ కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున వైద్యాధికారులను ఆదేశించారు.
జిల్లాలో 25 శాతం కరోనా పాజిటివిటీ కేసులు
కలెక్టర్ ఎ.మల్లికార్జున
మహారాణిపేట, జూలై 6: జిల్లాలో కొవిడ్ కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కొవిడ్, డెంగ్యూ, మలేరియా కేసులపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 550 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే, 109 కేసులతో 25 శాతం పాజిటివిటీ నమోదైందని వివరించారు. అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో అవసరమైన కొవిడ్ కిట్స్, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా, మాస్క్లు ధరించేలా చైతన్యం కల్పించాలని సూచించారు. అదేవిధంగా డెంగ్యూ, మలేరియా ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. డెంగ్యూ వ్యాధి చికిత్స అందించే ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిబాబు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.