విద్యను ఆయుధంగా మార్చుకోవాలి-ఫూలే ఆశయాలను సాధించాలి

ABN , First Publish Date - 2022-04-12T00:27:34+05:30 IST

ఆధిపత్య కులాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని మహాత్మా జ్యోతిబా ఫూలే చాటి చెప్పారని ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

విద్యను ఆయుధంగా మార్చుకోవాలి-ఫూలే ఆశయాలను సాధించాలి

హైదరాబాద్: ఆధిపత్య కులాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని మహాత్మా జ్యోతిబా ఫూలే చాటి చెప్పారని ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 196వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ హాజరయ్యారు. బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు అధ్యక్షత వహించగా బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులకోసం జీవితాన్ని ధారపోసిన మహాత్మా జ్యోతిబాపూలే విద్యను ఆయుధంగా చేసుకుని అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధార్శనికుడని వకుళాభరణం కృష్ణమోహన్ గుర్తుచేశారు. 


జాతిపిత గాంధీజీ కన్నా ముందుగా మహాత్మా అన్న బిరుదు పొందిన మహనీయుడు జ్యోతిబా ఫూలే అని ఆయన అన్నారు. బహుజనుల, వెనుకబడిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవల్ని గుర్తుంచుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం జ్యోతిబా ఫూలే కృషిచేసారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేత్రుత్వంలో ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే సిద్దాంతాల కనుగుణంగా పనిచేస్తుందని బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పూలే జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించడంతో పాటు వెనుకబడిన వర్గాలకు విద్యను అందించేందుకు వీలుగా ఆ మహనీయుడి పేరు మీద  బీసీ గురుకులాలు, విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రతి బిసీ విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు ఉద్యోగాలు సాధించేలా బిసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నామని ఆయన చెప్పారు. 


ఈ నెల 16న నిర్వహించే ఆన్ లైన్ పరీక్షకు బిసీ విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. బిసీల ఐక్యత కోసం జ్యోతిబా ఫూలే తన జీవితాన్ని ధారపోశారని సమాన హక్కులు సాధిస్తూ ఆయన ఆశయాలను నిజం చేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అధిపత్య కులాల పై ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలతో పాటు నిబద్దత అలవరుచుకోవాలని ఆయన అన్నారు. బిసీల మధ్య ఐక్యమత్యం పెరగాలని, అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చేలా పోరాటం చేయాలని  ఆయన పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల వారికి విద్యను అందిస్తున్న మన రాష్ట్రంలోని బిసీ గురుకులాలు దేశంలో మరెక్కడా లేవని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు.  


గురుకులంలో చదువుకుని సివిల్ సర్వీస్ లో అత్యున్నత ర్యాంకు సాధించిన  బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బిసి విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా బిసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, బిసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, బిసి ఫెడరేషన్ చైర్మన్లు చంద్రశేఖర్,బాలాచారి, ఉదయ్ కుమార్ , విమల, మహాత్మా జ్యోతిబా పూలే స్థాయి జయంతి ఉత్సాహ కమిటీ - 2022 ఆర్గనైజింగ్ ఛైర్మన్ ఆనంద్ కుమార్, రిసెప్షన్ కమిటీ చైర్మన్ నీలా వెంకటేష్, ప్రోగ్రాం కమిటీ ఛైర్మన్ రాజేందర్, ఆహ్వాన కమిటీ ఛైర్మన్ బడేసాబ్,బిసీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ బిసీ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యవిద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-12T00:27:34+05:30 IST