15 రోజుల్లోగా Bbmp ఎన్నికలు నిర్వహించండి
ABN , First Publish Date - 2022-05-11T16:33:45+05:30 IST
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలను 15 రోజుల్లోగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం కీలక తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జే
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలను 15 రోజుల్లోగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం కీలక తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జే కాన్హిల్కర్ నాయకత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దేశవ్యాప్తంగా మహానగర పాలికె ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏడాదిన్నర కాలంగా బీబీఎంపీ అధికారుల పాలనలో సాగుతున్న సంగతి విదితమే. బీబీఎంపీ వార్డుల సంఖ్యను 198 నుంచి 243కు పెంచినప్పటికీ ఇంకా వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో 198 వార్డులకే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీబీఎంపీ ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యే అవకాశం కనిపించడంతో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక్ నగరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీబీఎంపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరో రెండువారాల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీబీఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.