AP Minister కుమారుడు వైరల్ చేసిన సర్వేలో నిజానిజాలెంత.. అసలు ఉద్దేశ్యమేంటి.. ఊహించని షాకిచ్చిన BBC..!
ABN , First Publish Date - 2021-10-28T17:36:34+05:30 IST
ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన రాజకీయ పార్టీల గురించి బీబీసీ సర్వే చేసిందా?...
ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన రాజకీయ పార్టీల గురించి బీబీసీ సర్వే చేసిందా? ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన పార్టీ పేరు ఉందా? ఏపీలో ఈ ప్రచారాన్ని వైరల్ చేసిన ఓ మంత్రి కుమారుడి అసలు ఉద్దేశ్యం ఏంటి? సర్వేకు సంబంధించి బీబీసీ ఇచ్చిన సమాధానమేంటి? ఏబీఎన్ స్పెషల్ స్టోరీలో చూద్దాం..
ఆ పోస్ట్ అర్థమేంటి..!?
కొన్ని రాజకీయ పార్టీలు విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయి. నైతికతను గాలికి వదిలేస్తున్నాయి. దశాబ్దాలుగా ఉన్న రాజకీయ పార్టీలు కొనసాగించిన ఆరోగ్యకర పోటీ వాతావరణానికి కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని పార్టీలు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఎదుటి పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. భయంకరమైన అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తప్పుడు వార్తలను వైరల్ చేస్తున్నాయి. అదే క్రమంలో, వైసీపీకి చెందిన మంత్రి పేర్నినాని కుమారుడు కృష్ణమూర్తి అలియాస్ కిట్టూ సోషల్ మీడియా వేదికగా చేసిన అబద్ధపు పోస్ట్ చూడండి.
ఇష్టానుసారం మార్పులు.. చేర్పులు!
అసలు ఈ సర్వే ప్రతిష్టాత్మకమైన బీబీసీ న్యూస్ చేపట్టిందని ఆ పోస్ట్లో ప్రస్తావించారు. కానీ, ఇదే హెడ్లైన్తో చాలా మంది ఈ జాబితాను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఒక్కో సోషల్ మీడియా యూజర్ ఒక్కో జాబితాను తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పోస్ట్ చేశారు. వాటిలో కొందరు బీజేపీని అత్యంత అవినీతికర రాజకీయ పార్టీల జాబితాలో మొదటి స్థానంలో చేర్చారు. మరికొందరు బీజేపీని ఆ జాబితాలో నాలుగోస్థానంలో చేర్చారు. ఇంకొందరేమో బీజేపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీని చేర్చారు. వాటికి సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో చూడొచ్చు. అంటే.. కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలచుకునేందుకు, ఎదుటి పార్టీలపై బురద చల్లేందుకు ఈ జాబితాను ఎలా పడితే అలా ఉపయోగించుకున్నారన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎవరికి వాళ్లు వాళ్లకు అనుకూలంగా ఈ లిస్ట్ను మార్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో దీనిని వైరల్ చేస్తున్నారు. ఒక్క ట్విట్టరే కాదు.. ఫేస్బుక్లో కూడా వైరల్ చేస్తున్నారు.
అదంతా అబద్ధమే..!
వాస్తవానికి బీబీసీ న్యూస్ ఇప్పటివరకు అసలు ఇలాంటి సర్వే చేయనే లేదు. మొట్టమొదటగా 2017లో బీబీసీ న్యూస్ సర్వే పేరిట ఈ వైరల్ ఇమేజ్ సోషల్ మీడియాలో కనిపించింది. అయితే, అప్పుడే బీబీసీ ప్రతినిధి గీతాపాండే వివరణ ఇచ్చారు. ఇలాంటి ఫేక్న్యూస్లు వైరల్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, బీబీసీ సంస్థ అలాంటి సర్వే చేయలేదని.. తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ప్రధానంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రాభవాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పుడు పోస్ట్ను క్రియేట్ చేసినట్లు తేటతెల్లమవుతోంది. అంతేకాదు.. జనాలను సులువుగా నమ్మించేందుకు ఓ ప్రముఖ సంస్థ ఈ సర్వే చేసిందంటూ అబద్ధపు ప్రచారం చేసినట్లు అర్థమవుతోంది.
- సప్తగిరి గోపగోని, చీఫ్ సబ్ ఎడిటర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. గూగుల్న్యూస్ ఇనిషియేటివ్ ఇండియా నెట్వర్క్ మెంబర్.
టీడీపీని హైలైట్ చేసి..
ఇది.. మచిలీపట్నం ఎమ్మెల్యే, ఏపీ ఐ అండ్ పీఆర్ మంత్రి పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టూ తన ట్విట్టర్ హ్యాండిల్పై చేసిన పోస్ట్. ఇందులో ప్రపంచంలోని అత్యంత అవినీతికరమైన పార్టీల జాబితా అంటూ ఓ ఇమేజ్ను యాడ్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత అవినీతికర పార్టీల జాబితాలో భారత్లోని తెలుగుదేశం పార్టీ నాలుగోస్థానంలో ఉందన్నది ఆ పోస్ట్లో ప్రస్తావించిన ప్రధాన అంశం. అంతేకాదు.. ఆ జాబితాలో తెలుగుదేశం పార్టీ పేరును హైలైట్ చేశారు.