దేవరుప్పుల రణరంగం
ABN , First Publish Date - 2022-08-16T09:19:04+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత
సంజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత
ఇరు పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం
రాళ్లు, జెండా కర్రలతో బీజేపీ కార్యకర్తల దాడి
నలుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు, ఓ మహిళకు గాయాలు
గీతామూర్తి కారు సహా 4 కార్ల అద్దాలు ధ్వంసం
దాడులు చేస్తే భయపడం: సంజయ్
సంజయ్ వెంట 500 మంది గూండాలు
వాళ్లే కర్రలు, రాళ్లతో మా వారిపై దాడి చేశారు
సానుభూతి కోసమే పాదయాత్ర: ఎర్రబెల్లి
(ఆంధజ్ర్యోతి న్యూస్ నెట్వర్క్)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో దేవరుప్పుల మండల కేంద్రం రణరంగంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా గుండాల మండలం దేవరుప్పుల చౌరస్తాలో సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభా వేదికపై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు చేశారు. దీంతో టీఆర్ఎస్ మండల కార్యదర్శి చింత రవి జోక్యం చేసుకొని..
కేంద్ర ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రవిని తీసుకెళ్తుండగా వెనుక నుంచి బీజేపీ కార్యకర్తలు తరిమే ప్రయత్నం చేశారు. దీనిని చౌరస్తా ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఇంతలో వెనుక నుంచి కొంత మంది బీజేపీ కార్యకర్తలు జెండా కర్రలతో దాడి చేయగా, మరికొందరు రాళ్లు రువ్వారు. దీంతో నలుగురు టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఓ మహిళకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో ఒక బీజేపీ కార్యకర్తకు దెబ్బలు తాకాయి. సుమారు అరగంట పాటు ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలు మూడు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తిని అడ్డుకుని, కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో వారిని అరెస్టు చేయాలని ఆమె రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. తర్వాత టీఆర్ఎస్ వాళ్లు రోడ్డుపై కూర్చోగా, పోలీసులు వారిని పంపించారు.