Basavaraja Horatti: సభాపతి పదవిపై బీజేపీలో తర్జన భర్జన

ABN , First Publish Date - 2022-09-20T17:31:40+05:30 IST

బీజేపీ తీర్థం పుచ్చుకుని వరుసగా ఎనిమిదోసారి పరిషత్‌లోకి అడుగు పెట్టి రికార్డు సృష్టించిన బసవరాజ హొరట్టి(Basavaraja Horatti)కి సభా

Basavaraja Horatti: సభాపతి పదవిపై బీజేపీలో తర్జన భర్జన

- వ్యతిరేకిస్తున్న కొందరు పార్టీ ఎమ్మెల్సీలు

- తాత్కాలిక సభాపతి రఘునాథరావును ఎన్నుకోవాలని ఒత్తిడి


బెంగళూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తీర్థం పుచ్చుకుని వరుసగా ఎనిమిదోసారి పరిషత్‌లోకి అడుగు పెట్టి రికార్డు సృష్టించిన బసవరాజ హొరట్టి(Basavaraja Horatti)కి సభాపతి పదవి అప్పగించే విషయంలో పార్టీలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతోంది. ఈనెల 21న పరిషత్‌ సభాపతి ఎన్నిక జరగాల్సి ఉండగా ఈ ఎన్నికను వాయిదా వేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌(Nalin Kumar Katil) ముఖ్యమంత్రికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి బొమ్మై అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో పరిషత్‌ సభాపతి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించడమే కాకుండా నామినేషన్‌ వేసేందుకు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా హొరట్టికి కూడా సూచనలు వెళ్లాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సంబంధించిన ఫైల్‌ గవర్నర్‌కు వెళ్లాల్సిన తరుణంలోనే పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఇందుకు బ్రేక్‌ వేసినట్టు తెలుస్తోంది. మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయడం సరికాదని కొందరు మంత్రులు అభిప్రాయపడినప్పటికీ సీఎంతో నేరుగా మాట్లాడిన పార్టీ నేతలు చివరకు ఈ అంశంపై విజయం సాధించినట్టు తెలుస్తోంది. జేడీఎస్‌(JDS) నుంచి వచ్చిన హొరట్టికి సభాపతి పదవి ఇవ్వడాన్ని పార్టీలో పలువురు ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక సభాపతిగా ఉన్న రఘునాథరావు మల్కాపురనే అధికారికంగా ఎన్నుకోవాలని పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలకే ఈ పదవి దక్కాలని పెద్దఎత్తున ఒత్తిడి వస్తున్న కారణంగానే అధిష్టానం పెద్దలతో చర్చించి ఏకంగా ఎన్నికల ప్రక్రియకే బ్రేక్‌ వేయించారని సమాచారం. 

Updated Date - 2022-09-20T17:31:40+05:30 IST