Bommai సీఎంగా కొనసాగుతారు: బీజేపీ
ABN , First Publish Date - 2022-05-03T23:54:54+05:30 IST
కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందనే ఊహాగానాలను బీజేపీ నేతలు..
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందనే ఊహాగానాలను బీజేపీ నేతలు కొట్టివేశారు. ఇవి కేవలం ఊహాజనితమేనని, ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై కొనసాగుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారంనాడు తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో కర్ణాటకలో నాయకత్వ మార్పులు ఉంటాయంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీటిపై సింగ్ స్పందిస్తూ, ఊహాజనితమైన ప్రశ్నలకు జవాబులు ఉండవని అన్నారు. ప్రధాని నాయకత్వంలో పేదలు, రైతుల కోసం బొమ్మై పని చేస్తున్నారని కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా కూడా ఉన్న సింగ్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలను రెవెన్యూ మంత్రి ఆర్.అశోక కూడా సమర్ధించారు. సీఎం మార్పు జరుగుతుందంటూ ఎవరూ కలలు కనవద్దని, ఆ ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బొమ్మై నాయకత్వం వహిస్తారని హోం మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారని, పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులు బొమ్మైకి ఉన్నాయని చెప్పారు.
కాగా, మైసూరులో గత వారంలో జరిగిన ఓ కార్యకర్మంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో నాయకత్వ మార్పులు జరగవచ్చనే ఊహాగానాలకు తావిచ్చాయి. కొత్తరక్తం ఎక్కించాలంటే మార్పులు తప్పనిసరని సంతోష్ వ్యాఖ్యానించారు. దీంతో గుజరాత్ తరహాలో ముఖ్యమంత్రితో సహా మొత్తం అందరినీ మార్చనున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపించింది. అయితే అలాంటి వార్తలేమీ (నాయకత్వ మార్పు) తమ వద్ద లేదని, ఇవి కేవలం ఊహాగానాలేనని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కొట్టిపారేశారు. రెండు, మూడు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని, దీనిపై తుది నిర్ణయంతో అమిత్షా బెంగళూరు వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బొమ్మై క్యాబినెట్లో ఐదు ఖాళీలు ఉన్నాయి.