బార్లు.. బీర్ల తెలంగాణగా మార్చారు!
ABN , First Publish Date - 2022-10-05T09:27:36+05:30 IST
టీఆర్ఎస్ పాలకులు బంగారు తెలంగాణను బార్ల తెలంగాణ.. బీర్ల తెలంగాణగా మార్చారని వైఎ్సఆర్ టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు.
మెదక్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీఆర్ఎస్ పాలకులు బంగారు తెలంగాణను బార్ల తెలంగాణ.. బీర్ల తెలంగాణగా మార్చారని వైఎ్సఆర్ టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. ఇలాంటి నేతలేనా మహాత్ముడితో పోల్చుకునేదంటూ ప్రశ్నించారు. ‘సత్యానికి మారు పేరు మహాత్ముడైతే అసత్యానికి మారు పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు’ అని ఆమె విమర్శించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్ తీరు... అమ్మకు అన్నం పెట్టడు కాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయి స్తా అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా చేగుంటలో వైఎ్సఆర్ టీపీ నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ’బీర్లు తాగొద్దు.. లిక్కర్ మాత్రమే తాగాలట.. బీర్లతో లాభం లేదట, లిక్కర్తోనే లాభం అంటూ’ తాను పత్రికల్లో చదివానన్నారు. ఇలాం టి వార్తలు చూస్తుంటే తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నా రు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అవినీతి గురించి మాట్లాడితే తనపై ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా? దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే మాట్లాడకూడదని రాజ్యాంగంలో రాశారా? అని ప్రశ్నించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై కూడా షర్మిల ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికల్లో గెలిచి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు.