నగలు బేరమాడుతూ గాజులు నొక్కేశారు
ABN , First Publish Date - 2021-10-19T07:43:33+05:30 IST
నగలు చూస్తూ.. బేరమాడతూ.. జ్యువెలరీ దుకాణంలో రెండు గాజులు నొక్కేశారు ముగ్గురు మహిళలు.
ముగ్గురు మహిళల ఘరానా చోరీ
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 18: నగలు చూస్తూ.. బేరమాడతూ.. జ్యువెలరీ దుకాణంలో రెండు గాజులు నొక్కేశారు ముగ్గురు మహిళలు. సోమవారం రాత్రి తిరుపతిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎం.ఆర్.పల్లె ఎస్ఐ దీపిక తెలిపిన ప్రకారం.. ఎయిర్ బైపాస్ రోడ్డులోని కేవీఆర్ జ్యువెలరీ దుకాణానికి ముగ్గురు మహిళలు వచ్చారు. నగలు చూపించమంటూ పలు రకాల ఆభరణాలను చూశారు. అవేమీ నచ్చలేదంటూ వెళ్లిపోయారు. దీంతో వారికి చూపించిన నగలను సిబ్బంది యథావిధిగా సర్దుకునే క్రమంలో వారికి రెండు గాజులు కనిపించలేదు. అనుమానవచ్చి సీసీ ఫుటేజీని పరిశీలించగా ముగ్గురు మహిళల్లో ఒకరు గాజులను దాచేయడాన్ని గుర్తించారు. 24 గ్రాముల రెండు బంగారు గాజులు మహిళలు చోరీ చేసినట్టు జ్యువెలరీ యజమాని రామకృష్ణ ఎం.ఆర్.పల్లె పోలీసులకు పిర్యాదు చేయగా.. వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.