ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-05-18T17:57:48+05:30 IST

కరోనాతో గ్రేటర్‌ పరిధిలోని బార్లు, రెస్టారెంట్‌లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయని, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రేటర్‌

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోవాలి

మద్యం దుకాణాల సమయాన్ని తగ్గించాలి : బార్‌ యజమానులు

హైదరాబాద్/పంజాగుట్ట: కరోనాతో గ్రేటర్‌ పరిధిలోని బార్లు, రెస్టారెంట్‌లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయని, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ రెస్టారెంట్‌, బార్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మద్యం దుకాణాల సమయాన్ని ఉదయం 11గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కుదించాలని, తాము చెల్లిస్తున్న లైసెన్స్‌ ఫీజును నాలుగు వాయిదాలుగా చెల్లించే అవకాశం కల్పించాలని అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, శ్రీధర్‌ రెడ్డి, సత్యనారాయణ లతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న తమను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.


ఒకవైపు మద్యం అమ్మకాలు పెంచాలని చెప్పుతూనే మరోవైపు బార్ల ముందే డ్రంకెన్‌ డ్రైవ్‌ పెడుతుండడంతో వినియోగదారులు రావడం లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెయ్యి నుంచి రెండు వేల గజాల్లో పర్మిట్‌ రూమ్స్‌ నడుస్తున్నాయన్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా తమకు న్యాయం జరగడం లేదన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, సునీల్‌ కుమార్‌, కృష్ణారెడ్డి, మహేందర్‌, పలువురు బార్లు, రెస్టారెంట్ల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T17:57:48+05:30 IST