బంజారాహిల్స్‌లో అమ్మిన ఇల్లు తిరిగి ఆక్రమణ

ABN , First Publish Date - 2021-03-30T17:15:37+05:30 IST

అమ్మిన ఇంటిని తిరిగి ఆక్రమించిన కుటుంబంపై..

బంజారాహిల్స్‌లో అమ్మిన ఇల్లు తిరిగి ఆక్రమణ
File photo

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : అమ్మిన ఇంటిని తిరిగి ఆక్రమించిన కుటుంబంపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్‌నగర్‌లో నివసిస్తున్న పి. వెంకటరమణ మేస్త్రి. 2019 డిసెంబర్‌ 4న మణిందర్‌సింగ్‌ అనే వ్యక్తి వద్ద ఓ భవనంలోని 3వ అంతస్థుతోపాటు రెండో అంతస్థులో రెండు గదులు కొనుగోలు చేశాడు. వెంకటరమణ మూడో అంతస్థులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. రెండో అంతస్థులో ఓ గదిని అరుణ, మరో గదిని సంధ్య అనే వారికి అద్దెకు ఇచ్చాడు. ఈ నెల 24న సంధ్య గది ఖాళీ చేయగా వెంకటరమణ దానికి తాళం వేశాడు.


అదే రోజు మణిందర్‌సింగ్‌ తన కుటుంబ సభ్యులు బలవంత్‌కౌర్‌, సన్నిసింగ్‌, అతడి సోదరితో కలిసి తాళం పగులకొట్టి ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. వెంకటరమణ ఈ వ్యవహారంపై డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. మరుసటి రోజు కూడా మణిందర్‌సింగ్‌ మరోసారి తాళం పగులగొట్టాడు. తాను ఇల్లు అమ్మలేదని ఆక్రమించాడు. బాధితుడి పిర్యాదు మేరకు మణిందర్‌సింగ్‌, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-30T17:15:37+05:30 IST