పరీక్షల్లో మార్కులు చూసి షాకైన స్టూడెంట్స్.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-01-25T17:07:13+05:30 IST

ఊహించిన దాని కంటే ఎక్కువ మార్కులు వస్తే విద్యార్థుల సంతోషానికి పట్టపగ్గాలుండవు

పరీక్షల్లో మార్కులు చూసి షాకైన స్టూడెంట్స్.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ఊహించిన దాని కంటే ఎక్కువ మార్కులు వస్తే విద్యార్థుల సంతోషానికి పట్టపగ్గాలుండవు. అయితే మ్యాగ్జిమమ్ మార్కుల కంటే ఎక్కువ వస్తే షాకవడం తప్ప ఇంకేం చేయాలో తెలియదు. తాజాగా బెంగళూరులోని ఓ యూనివర్సిటీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. కొందరు విద్యార్థులకు 100కు 102 మార్కులు వచ్చాయి. కొందరికి 105 కూడా వచ్చాయి. దీంతో వారు యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 


బెంగళూరు యూనివర్సిటీ తాజాగా బీకామ్ స్టూడెంట్స్ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. అందులో తమ మార్కులు చూసుకున్న కొందరు విద్యార్థులు షాకయ్యారు. ఎందుకంటే వారికి మ్యాగ్జిమమ్ మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. `నేను రిజల్ట్ చూసి షాకయ్యా. ఎందుకంటే ఒక సబ్జెక్ట్‌లో నాకు 100కు 102 మార్కులు వచ్చాయి. ఫలితాలు ప్రకటించే ముందు యూనివర్సిటీ యాజమాన్యం ఎందుకు సరిచూసుకోలేదో నాకు అర్థం కావడం లేద`ని ఒక విద్యార్థి పేర్కొన్నాడు. అయితే ఈ గందరగోళానికి డిజిటల్ వాల్యూయేషన్ కారణమని యూనివర్సిటీ యాజమాన్యం చెబుతోంది. 


`పరీక్ష పత్రాల్లోని సూచనలను విద్యార్థులు చదవలేదు. ఈ పరీక్షలకు రెండు రకాల విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ స్టూడెంట్స్‌తో పాటు రెండోసారి పరీక్ష రాస్తున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాశారు. రెగ్యులర్ స్టూడెంట్స్ 70 మార్కులకు మాత్రమే జవాబులు రాయాలి. రెండోసారి పరీక్ష రాస్తున్న విద్యార్థులు 100 మార్కులకు రాయాలి. చాలా మంది విద్యార్థులు ఛాయిస్ తీసుకోకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేశారు. డిజిటల్ వాల్యూయేషన్ జరగడంతో అన్ని సమాధానాలకు మార్కులు పడడంతో కొందరికి మ్యాగ్జిమమ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చేశాయ`ని యూనివర్సిటీ ప్రతినిథి తెలిపారు. 


Updated Date - 2022-01-25T17:07:13+05:30 IST