బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు!

ABN , First Publish Date - 2021-04-03T21:32:04+05:30 IST

బెంగళూరు డ్రగ్స్‌ కేసు.. రాష్ట్ర ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంది. ఈ కేసులో హైదరాబాద్‌ వ్యాపారవేత్తలను బెంగళూరు పోలీసులు విచారించారు.

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు!

హైదరాబాద్: బెంగళూరు డ్రగ్స్‌ కేసు.. రాష్ట్ర ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంది. ఈ కేసులో హైదరాబాద్‌ వ్యాపారవేత్తలను బెంగళూరు పోలీసులు విచారించారు. ఈ కేసులో నగరానికి చెందిన సందీప్‌రెడ్డి, కలహర్‌రెడ్డిల పాత్రపై దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే సందీప్‌రెడ్డిని బెంగళూరు పోలీసులు విచారించారు. బెంగళూరులో సందీప్‌, కలహర్‌రెడ్డి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో పబ్‌లు, హోటల్స్‌ వ్యాపారంలో వీరిద్దరూ ఉన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖులకు నిత్యం పార్టీలు ఇస్తున్నట్టు గుర్తించారు. కన్నడ సినీ పరిశ్రమతో కూడా వీరికి సంబంధాలు ఉన్నాయి. కన్నడ సినీ పరిశ్రమకు కలహర్‌, సందీప్‌లు ఫైనాన్స్‌ చేస్తున్నారు. నిర్మాత శంకర్‌గౌడ్‌తో కలిసి ఫైనాన్స్‌ చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. 


కొన్నాళ్ల క్రితం నైజీరియన్స్‌ను బెంగళూరు పోలీసులు పట్టుకోగా.. తీగ లాగితే డొంక కదిలింది. కలహర్‌, సందీప్‌, శంకర్‌గౌడ్‌లకు ఈ నైజీరియన్స్ డ్రగ్స్‌ సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో  ముగ్గురు వ్యాపారవేత్తలకు బెంగళూరు పోలీసులు నోటీసులిచ్చారు. అయితే ఈ కేసులో కలహర్‌రెడ్డి, శంకర్‌గౌడ్‌ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. కలహర్‌రెడ్డి ప్రజా ప్రతినిధులకు పార్టీలిచ్చేవాడని విచారణలో సందీప్‌ తెలిపాడు. పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారని చెప్పాడు. ఓ ఎమ్మెల్యే నేరుగా కొకైన్‌ను తీసుకెళ్లినట్లుగా తెలిపాడు. ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు కొకైన్‌ పంపినట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. నలుగురు ఎమ్మెల్యేలు కూడా డ్రగ్స్‌ తీసుకున్నారని విచారణలో సందీప్‌ వెల్లడించాడు. కలహర్‌రెడ్డి, శంకర్‌గౌడ్‌తోపాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలను బెంగళూరు పోలీసులు విచారించనున్నారు. 

Updated Date - 2021-04-03T21:32:04+05:30 IST