22 ఏళ్లు కోల్‌కతాలోనే తలదాచుకున్న ‘బంగబంధు’ కిల్లర్

ABN , First Publish Date - 2020-04-10T02:07:05+05:30 IST

బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్‌ హత్య కేసు నిందితుడు అబ్దుల్ మజీద్‌కు సంబంధించి

22 ఏళ్లు కోల్‌కతాలోనే తలదాచుకున్న ‘బంగబంధు’ కిల్లర్

కోల్‌కతా:  బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్‌ హత్య కేసు నిందితుడు అబ్దుల్ మజేద్‌కు సంబంధించి విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన నాలుగున్నర దశాబ్దాల తర్వాత మంగళవారం ఢాకాలో అబ్దుల్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. కోల్‌కతాలో తాను 22 ఏళ్లకుపైగా నివసించినట్టు నిందితుడు అంగీకరించాడు. గత నెలలోనే తాను కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్ వచ్చినట్టు తెలిపాడు.


విషయం తెలిసిన కోల్‌కతా ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు ఈ విషయమై స్పందించారు. బంగ్లాదేశ్ పోలీసులతో టచ్‌లో ఉన్నట్టు చెప్పారు. అరెస్ట్ అయిన విషయం తప్ప కోల్‌కతాలో నివసించినన్ని రోజులు అతడు ఏం చేశాడనే విషయాలను తమతో ఇంకా పంచుకోలేదని తెలిపారు.   


బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి తొలగింపునకు గురైన మజేద్‌కు ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించింది. మజీద్ కోల్‌కతా శివారు, నార్త్, సౌత్ 24 పరగణాల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో దాక్కున్నట్టు తెలిసిందని ఐబీ అధికారులు తెలిపారు. అతడు భారతీయుడని నిరూపించుకునే ఆధారాలను సంపాదించాడని, పాస్‌పోర్టు కూడా ఉందని తమకు సమాచారం అందిందన్నారు. అతడెప్పుడూ ఒక్క ప్రాంతంలో ఎప్పుడూ నివసించలేదని, ఎక్కువగా అద్దె ఇళ్లలోనే ఉండేవాడని చెప్పారు.  

బంగబంధు హత్యకేసులో పలాయనంలో ఉన్న ఆరుగురు హంతకుల్లో మజేద్ ఒకడు. అతడు విదేశాలకు పారిపోయినట్టు గుర్తించినప్పటికీ ఎక్కడున్నాడో మాత్రం గుర్తించలేకపోయారు. 1997లో ముజీబర్ కుమార్తె షేక్ హసీనా ప్రధానిగా ఎన్నికైన తర్వాత తండ్రి హత్యకేసును తిరిగి తెరిచారు. దీంతో మజేద్ అదృశ్యమయ్యాడు.


మజేద్ మార్చి 16న కోల్‌కతా ఎయిర్‌పోర్టు ద్వారా విమానంలో బంగ్లాదేశ్ చేరుకున్నాడు. అతడు కోల్‌కతాలో ఒంటరిగా జీవించాడన్న సమాచారం తమకు అందిందని, అయితే, ఇన్నేళ్లూ అతడు ఏం చేశాడన్న వివరాలు తెలియరాలేదని కోల్‌కతాలోని ఐబీ అధికారులు తెలిపారు. మజేద్ భార్య కోల్‌కతాలో నివసిస్తుండగా, కుమారుడు అమెరికాలో ఉన్నాడని ఐబీ అధికారులు వివరించారు. 

Updated Date - 2020-04-10T02:07:05+05:30 IST