టీఆర్ఎస్, కాంగ్రెస్.. కుమ్మక్కయ్యాయి
ABN , First Publish Date - 2021-04-16T09:25:01+05:30 IST
సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, ఇక్కడ సాగర సమరం కాకుండా సాగర సంగమం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా హాలియాలో గురువారం నిర్వహించిన
సాగర సమరం కాదు.. సాగర సంగమం: బండి సంజయ్
హాలియా, ఏప్రిల్ 15: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, ఇక్కడ సాగర సమరం కాకుండా సాగర సంగమం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా హాలియాలో గురువారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. డబ్బు, మద్యంతో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. గత నాలుగేళ్లలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపాధి హామీ, మొక్కల పెంపకం, మరుగుదొడ్లు, ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం నుంచి రూ.386కోట్లు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద రూ.618కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ లెక్కలు తప్పైతే తనపై కేసులు పెట్టాలని సూచించారు. మతపరమైన రిజర్వేషన్లను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని, గుంటనక్కలు లక్షల కోట్లు దోచుకున్నాయని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్పై కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ మాట ఏమైందని ప్రశ్నించారు. జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, అందుకే ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ అభ్యర్థి రవినాయక్ను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.