పాతబకాయిలకే ‘బంధు’
ABN , First Publish Date - 2022-01-05T05:59:45+05:30 IST
పెట్టుబడి సమయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడద న్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది.
అక్కరకు రాని రైతుబంధు సొమ్ము
పాత రుణాల కింద జమ చేసుకుంటున్న బ్యాంకర్లు
రైతులకు సమాచారం ఇవ్వకుండా రికవరీ
బ్యాంకర్ల తీరుతో రైతుల్లో ఆందోళన
జిల్లాలో నీరుగారుతున్న రైతుబంధు పథకం
సూర్యాపేట సిటీ, జనవరి 4: పెట్టుబడి సమయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడద న్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. పంట సాగు సమయంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా, అప్పులు చేసి తిప్పలు పడకూడదని ప్రభుత్వం 2018, మే 10వ తేదీన ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే కొంత మంది బ్యాంకర్ల నిర్వాకం వల్ల రైతులు ఇబ్బందులు పడు తున్నారు. పాత బకాయిల కింద రైతుబంధు డబ్బులను జమ చేసు కుంటుండడంతో పెట్టుబడికోసం మళ్లీ తిప్పలు తప్పడంలేదు. ప్రభు త్వం రైతుబంధు కింద డబ్బులను జమ చేస్తుండగా, ఆ సొమ్మును తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లిన రైతులు నిరాశతో వెను దిరుగుతు న్నారు. డిసెంబరు 28వ తేదీ నుంచి యాసంగి సీజన్కు సంబంధించి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 2,70,853 మంది రైతులకు రూ.314,95,09,368 నగదు జమ కావాల్సి ఉంది. మంగళవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 2,38,068 మంది రైతులకు రూ.221,49,54,248 రైతుబంధు కింద జమ అయినట్లు జిల్లా వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
పాతబాకీలు ఉంటే డబ్బులు కట్
రైతులు గతంలో వివిధ అవసరాలకోసం బ్యాంకుల ద్వారా పంట రుణాలు, బంగారం కుదవ పెట్టి లోన్లు తీసుకున్నారు. అయితే వీరికి రైతుబంధు కింద జమయిన సొమ్మును బ్యాంకర్లు కట్ చేసుకుంటున్నా రు. ప్రభుత్వం దశలవారీగా రైతుల రుణాలను మాఫీ చేస్తుంటే, బ్యాంక ర్లు మాత్రం తీసుకున్న రుణాలను రైతులు రెన్యూవల్ చేసుకోవడంలేద ని, తద్వారా వారిని డిఫాల్ట్ రైతులుగా గుర్తించి వారి డబ్బులు మాత్ర మే కట్ చేసుకుంటున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే ఇందు లో వాస్తవం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 2021లో తీసుకున్న రుణా లకు సైతం వడ్డీల కింద రైతుబంధు డబ్బులను కట్ చేస్తున్నారని రైతు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతుబంధు సొమ్ము తీసుకునేందుకు బ్యాంకుకు వెళితే గతంలో తీసుకున్న రుణానికి మాఫీ అయిందని బ్యాంకర్ల నుంచి సమాధానం వస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు డబ్బులు ఇవ్వాలి: డి.రామారావు నాయక్, జిల్లా వ్యవసాయాధికారి
రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు రైతులకు ఖచ్చితంగా ఇవ్వాలి. పాత బాకాయిలు, వడ్డీల రూపంలో రైతుబంధు డబ్బులను జమ చేసుకోవద్దు. బ్యాంకర్లు రైతుబంధు డబ్బులను వడ్డీల కింద జమ చేసుకుంటే మా దృష్టికి తీసుకురావాలి.
రైతుబంధు డబ్బులను కట్ చేశారు: స్వప్న, యల్కపల్లి, నూతన్కల్ మండలం.
నూతన్కల్ మండలకేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో పుస్తెలతాడు తాకట్టు పెట్టి 2019లో రూ.65వేలు అప్పు తీసుకున్నాను. రైతుబంధు డబ్బులు రూ.5,750లు నా బ్యాంకు ఖాతాలో జమయినట్లు ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకు వెళితే రుణం వడ్డీకింద జమ చేసుకున్నట్లు బ్యాంకు మేనేజర్ తెలిపారు. రైతుబంధు సొమ్ము వచ్చిన ఆనందం లేకుండాపోయింది.